న్యూఢిల్లీ: సెకండ వేవ్ ముగిసిపోతున్న సూచనల మధ్య ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల గురించి ఆప్ సర్కారు ఆలోచిస్తున్నది. కానీ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ఐఐటీ-ఢిల్లీ ఒక అధ్యయన నివేదికలో హెచ్చరించింది. ఈ వేవ్లో రోజుకు 45 వేల కేసులు రావచ్చని, 9 వేల మందికి హాస్పిటల్ బెడ్ అవసరం కావచ్చని నివేదిక తెలిపింది. శుక్రవారం ఈ నివేదికను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే రోజుకు 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని సూచించింది. న్యాయమూర్తులు విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్తో కూడిన ధర్మాసనం నివేదికలో చేసిన సిఫారసులపై నాలుగు వారాల్లోగా కార్యాచరణ పట్టికను సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ కేంద్రాల వికేంద్రీకరణ అనేది నివేదికలోని కీలక సిఫారసుల్లో ఒకటని కోర్టు అభిప్రాయపడింది. ఒకే చోట ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి సిలిండర్లు రవాణా చేసే బదులు దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆక్సిజన్ యూనిట్లు నెలకొల్పాలని నివేదిక సూచించింది. శతాబ్దానికి ఒకసారి వచ్చే మహాగత్తరను ఎదుర్కొంటున్నాం.. చివరిసారిగా 1920లో ఇలాంటిది వచ్చింది. ఆక్సిజన్ ఉత్పాదక కేంద్రం నెలకొల్పడానికి ఢిల్లీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనివల్ల నిల్వచేయడం, రవాణా, ఆవిరై పోవడం వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.