హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): సమాజంలో అట్టడుగు వ్యక్తి న్యాయంకోసం కోర్టు తలుపులు తట్టినప్పుడే.. న్యాయ వ్యవస్థ అందరికీ చేరువైనట్టు భావించాలని సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శనివారం గోవాలో బాంబే హైకోర్టు బెంచ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ రమణ.. నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేంద్ర రాష్ర్టాల ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు నెలకు రెండు కేసులైనా ఉచితంగా చేయాలని పిలుపునిచ్చారు. అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తన పేరును ప్రతిపాదించిన తర్వాత జస్టిస్ రమణ పాల్గొన్న తొలి కార్యక్రమంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాల్సిన తీరుపై కీలక ప్రసంగం చేశారు. న్యాయం అందుబాటులోకి రావాలంటే రోజురోజుకీ పెరుగుతున్న కేసులకు తగ్గట్టు మౌలికవసతులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో మౌలికవసతుల ఆధునీకరణకు మేధావులు, నిపుణులు సూచించాలన్నారు. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుతో మౌలికవసతుల సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులతోపాటు ఏకరూపత, ప్రామాణికతను తీసుకురావడానికి వీలవుతుందని చెప్పారు. ప్రజలకు అడ్డంకుల్లేని స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించేలా వ్యవస్థను ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు. సమాజంపట్ల న్యాయవాదులు తమ బాధ్యతలను ఎప్పటికీ మరిచిపోవద్దని అన్నారు. దేశంలో అత్యధిక జనాభా అత్యల్ప ఆదాయంతో గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. సీనియర్లు నెలకు కనీసం రెండు ఉచిత కేసులు చేస్తే అది భారతీయ న్యాయసహాయ రూపురేఖలను సమూలంగా మార్చేస్తుందని చెప్పారు.