న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఢిల్లీలో కొవిడ్ విజృంభణకు కారణం బ్రిటన్ రకం వైరస్ అని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజీత్కుమార్ సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15,135 వైరస్ నమూనాలపై (వేరియంట్లపై) అధ్యయనం చేయగా ఒక్క ఢిల్లీలోనే 400కు పైగా మందిలో బ్రిటన్ రకం వైరస్ కనిపించిందని తెలిపారు. గత మార్చితో పోల్చితే ఈ రకం వైరస్ వ్యాప్తి రెట్టింపు అయిందన్నారు. ఢిల్లీలో 76 మందికి డబుల్ మ్యూటంట్ వైరస్ సోకిందని తెలిపారు. ఢిల్లీలో 3,208 నమూనాల జన్యుక్రమాన్ని విశ్లేషించారు. మొత్తం నమూనాల సమాచారం బట్టి చూస్తే దేశవ్యాప్తంగా 1,735 మందిలో వేరియంటు ్లబయటపడ్డాయి. ఇది మొత్తం నమూనాల్లో 11.5 శాతం. 1,644 మందిలో బ్రిటన్ వైరస్, 112 మందిలో దక్షిణాఫ్రికా వైరస్, బ్రెజిల్ వైరస్ ఒక్కరిలో, డబుల్ మ్యూటంట్ వైరస్ 732 మందిలో కనిపించింది. ఇందులో తెలంగాణలో 170 మందిలో బ్రిటన్ వైరస్, 57 మందిలో దక్షిణాఫ్రికా రకం వైరస్, ముగ్గురిలో డబుల్ మ్యూటంట్ వైరస్ కనిపించింది. దేశంలో ఇప్పటివరకు కనుగొన్న వైరస్ రకాలల్లో అత్యధిక వేరియంట్లు ఉన్న రాష్ర్టాల్లో పంజాబ్ (73.5%), యూపీ(60%) తర్వాత తెలంగాణ 41 శాతంతో మూడో స్థానంలో ఉన్నది.