“వివిధ భారతి హైదరాబాద్ వాణిజ్య ప్రసార విభాగం.. సమయం ఎనిమిది గంటలు కావస్తోంది.. ఇప్పుడు మీరు వింటారు జనరంజని.. శ్రోతలు కోరిన సినీగీతాల కార్యక్రమం..” ఇప్పుడు వినండి ‘అంతస్తులు’ సినిమా కోసం కొసరాజు రాసిన గీతం, కేవీ మహదేవన్ సంగీతం, పాడినవారు భానుమతి రామకృష్ణ. ఈ పాటను కోరినవారు సికింద్రాబాద్ వారాసిగూడ బ్రాహ్మణవీధి నుంచి సురేశ్ కాలేరు, రూపాజ్యోతి, నమ్రత గుణ, స్నేహిత గుణ, హైదరాబాద్ మలక్పేట నుంచి రాధ, నిజామాబాద్ జిల్లా ఉన్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, భూదాన్ పోచంపల్లి నుంచి భవాన్ల రాజు వారి కుటుంబ సభ్యులు.. హరివిల్లు శ్రోతలకు స్వాగతం”, “ప్రేక్షకుల అభిప్రాయలు తెలుసుకునే వేదిక లేఖావళి ఇప్పుడు”, “జరూఖా.. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు..”సరిగ్గా యాభై ఏండ్లు దాటిపోయింది, హైదరాబాద్ వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం పురుడు పోసుకొని. ఎఫ్ఎమ్ 102.8 మెగా హెట్జ్ తరంగ దైర్ఘ్యం కొద్ది దూరాలకే పరిమితం. కానీ, ఆ తరంగాలు శ్రోతల అంతరంగాలతో మమేకమైన తీరు అద్భుతం. ఎప్పటి రేడియో! లైసెన్స్ ఫీజు కట్టి విన్న రోజులు. సిలోన్ ప్రసారాలను చెవులు రిక్కించి విన్న రోజులు. ‘బినాకా గీత్మాలా’లో ప్రసారమైన హిందీ పాటలను మనసు పెట్టి విన్న రోజులు. సింహళ దీవినుంచి వినిపించే రాగాలను, మరిపించే గీతాలు ప్రసారం చేయడానికి పుట్టిందే వివిధ భారతి ప్రసార విభాగం.1957 అక్టోబర్ 3 బొంబాయిలో మొదలైన వివిధ భారతి అప్పట్లో సంచలనం. మీడియం వేవ్పై రెగ్యులర్ ప్రసారాలకు దీటుగా మోగిన ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ (ఎఫ్ఎమ్) మనకు ఆ పాత మధురంగా తోచినా.. తాతల తరానికి కొత్తే! దేశవ్యాప్తంగా పలు రేడియో స్టేషన్ల ‘బి’ కేంద్రాల నుంచి వివిధ భారతి బొంబాయి కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. తూర్పు వేదికపై వేకువ నర్తించక ముందే ఇంటింటా ఆకాశవాణి జాగృతం చేసేది. రోజంతా అలసిన మనసుకు సాంత్వన కలిగిస్తూ రసరమ్య గీతాల మాలిక ‘ఛాయా గీత్’తో నిద్రపుచ్చేది. ‘సంగీత్ సరిత’, ‘భూలే బిస్రే గీత్’, ‘హలో ఫర్మాయిష్’, ‘ఉజాలే ఉన్కీ యాదోంకీ’, సైనికుల కోసం ప్రసారమయ్యే ‘జయమాల’, నవ్వుల జల్లు కురిపించే ‘హవామహల్’ జల్కీలు ఇలా ఒకటా రెండా.. అనేక కార్యక్రమాలు. వినోదాలు పంచుతూనే విజ్ఞానాన్ని పెంచేవి. దశాబ్దాలు దాటుతున్నా ఆనాటి ఆణిముత్యాలు ఈనాటికీ అప్రతిహతంగా ప్రసారమవుతూ శ్రోతలను ఆనందింపజేస్తున్నాయి.
పాటలు.. మాటలు..
వివిధ భారతి.. పేరులోనే ఉందంతా! భిన్నత్వంలో ఏకత్వానికి వేదిక. ఏక భారతంలో ఉన్న వైవిధ్యాలను అందించే కానుక. బొంబాయి ఎఫ్ఎమ్ మొదలైన పద్నాలుగేండ్లకు మన హైదరాబాద్ వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం గొంతెత్తింది. అది 1971 మార్చి 21. అచ్చంగా యాభై ఏండ్ల కిందట ఇదే రోజు తెలుగు శ్రోతల మనసులో వివిధ భారతిపై అభిమానం రాజుకుంది. ఐదు దశాబ్దాలు దాటినా 102.8 ఎఫ్ఎమ్పై వారి అభిమానం ఇగిరిపోలేదు. ‘ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి’ అని ప్రకటించగానే ‘శ్రోతల గుండె చప్పుడు’ అనేవారు అనౌన్సర్లు. నిజమే! ఎన్ని చానల్స్ ఉన్నా ఇది శ్రోతల ఆత్మీయ నేస్తం. వారికిది సమస్తం!
ప్రతి ఉదయం 7.55 గంటలకు మొదలయ్యే ప్రసారాలు రోజులో మూడు విడతలుగా పలుకరిస్తూ ముప్పూటలా మృష్టాన్న భోజనం ఆరగించినంత తృప్తిని అందిస్తాయి. భావగీతంతో మొదలై, వివిధ భావనలకు వేదికై, భావోద్వేగాలకు నెలవై.. హైదరాబాద్ వివిధ భారతిని జీవితంలో భాగంగా చేసుకున్నారు శ్రోతలు. వారిని భాగస్తులను చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడమే ఇందరి అభిమానానికి కారణమని అంటారు విశ్లేషకులు. ‘జనరంజని’, ‘మీరు కోరిన పాటలు’, ‘హలో ఎఫ్ఎమ్’ తదితర కార్యక్రమాలన్నీ ‘గీత’కోకచిలుకలే! శ్రోతలు కోరిన పాటలను మాటల పల్లకీలో మోసుకొచ్చి వినిపించేవారు వ్యాఖ్యాతలు. ఆ మాటల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించి, ఆపై కోరుకున్న పాటను ఆసాంతం వింటూ మురిసిపోయేవారు. మొదట్లో భాగ్యనగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలను అలరించిన 102.8 ఎఫ్ఎమ్, కాలక్రమంలో వివిధ రేడియో స్టేషన్ల ద్వారా తెలుగు రాష్ర్టాల్లో, దూరతీరాల్లోనూ మార్మోగుతున్నది. ఈ స్మార్ట్ యుగంలో మొబైల్ అప్లికేషన్ల రూపంలో దేశదేశాంతరాల్లో వివిధ భారతి తరంగాలు ప్రవహిస్తున్నాయి. కార్లలో తిరిగే లక్షాధికారుల నుంచి మధ్యతరగతి ఆటోడ్రైవర్ల వరకు వివిధ భారతిపై అవ్యాజమైన మమకారం పెంచుకున్నారు. అచంచలమైన ప్రేమను కురిపిస్తున్నారు. ‘నిలయంలో సమయం..‘ అని అనౌన్సర్లు ప్రకటించిన సమయాన్నిబట్టి పనులు చక్కదిద్దుకునే వారూ ఉన్నారు.
లేఖల వెల్లువ
ఆకాశవాణి అంటే అప్పట్లో సెంటిమెంట్. రామపట్టాభిషేకం పటాన్ని పూజా మందిరంలో కొలువుదీర్చినట్టుగా రేడియోను అందమైన పీఠంపై ఉంచి అతి జాగ్రత్తగా చూసుకుంటారు. కరెంట్ కోతల కాలంలో అయితే, ప్రసారాలకు అంతరాయం కలుగకుండా జతలకు జతలు బ్యాటరీలు సిద్ధంగా ఉంచుకునేవారు. వివిధ భారతిలో వచ్చిన పాటను వచ్చినట్టు రాసుకుని మురిసిపోయేవారు కొందరైతే, నచ్చిన పాటలను పదేపదే కోరడానికి అదేపనిగా పోస్టుకార్డులు లెక్కకుమించి కొనేసేవారు ఇంకొందరు. నెల బడ్జెట్లో పోస్టుకార్డులకు ఇంతని కొంత కేటాయించుకున్న కుటుంబాలూ కోకొల్లలు వివిధ భారతి పరివారంలో. కార్డు ముక్కపై మూడు ముక్కల్లో పాట వివరాలుంటే దాన్ని కోరుకున్న శ్రోతల పేర్లు పదైనా ఉండి తీరాల్సిందే! ఒక్కోసారి పాతిక వరకూ ఉండేవి. కోరుకున్న పాట వినడం కన్నా, రేడియోలో తమకు నచ్చిన వ్యాఖ్యాత గళం నుంచి తమ పేరు వినాలనే ఆదుర్దా కొందరిది. రేడియో వినే బంధువుల చెవిన తమ పేరు పడాలనే ఆలోచన ఇంకొందరిది. రేడియోలో తమ పేరు విన్న ఆనందంలో అదే క్షణం ‘జనరంజని’కో, ‘లేఖావళి’కో ఉత్తరాలు రాసేస్తారు. రెండు రోజులు పేరు వినబడలేదా, అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ‘మా పేర్లు రావడం లేదం’ంటూ లేఖావళికి ఘాటుగా లేఖాస్త్రం సంధించేస్తారు. ‘హలో ఎఫ్ఎమ్’కు ఫోన్ చేసి తమ పేర్లు ఎందుకు చదవడం లేదంటూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు. కొందరికి ఇది వెర్రిప్రేమ అనిపిస్తుండొచ్చు. కానీ, వివిధ భారతిపై వారికున్న అభిమానం అలాంటిది. వెలకట్టలేనిది. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన శ్రోత సురేష్ కాలేరు అయితే రేడియోపై మమకారంతో టీవీ కూడా కొనలేదంటే ఆకాశవాణిపై వారి మక్కువ ఎంతెక్కువగా ఉండేదో తెలుస్తుంది.
అందరూ శ్రోతలే
కొత్తగా వివిధ భారతి వినడం మొదలుపెట్టిన వాళ్లకు ఈ పేర్లేంటి ఇంత విచిత్రంగా ఉంటాయా అనిపిస్తుంది. అనౌన్సర్లు నోటికొచ్చిన పేరు చదువుతారని భావించేవాళ్లూ ఉన్నారు. చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ పేర్లు రేడియోలో వినిపించని రోజుండదు. రాముడు పేరు తర్వాత మిగతావి కావాలనే చదివారని అనుకునేవాళ్లు కూడా! కానీ, కస్తూరి రాముడు ఉన్నాడు. అతడి సోదరులు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులూ ఉన్నారు. రామలక్ష్మణులు కవల పిల్లలు. వీరంతా జిమ్నాస్టిక్ మాస్టర్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో వినిపించే ప్రతి పేరు గల వ్యక్తీ ఉన్నారు. వారికి వివిధ భారతితో ఎడతెగని అనుబంధమూ ఉంది. శ్రోతల మధ్య కూడా దశాబ్దాలుగా ఆప్యాయతలు కొనసాగుతున్నాయి. అందరూ ఒకే కుటుంబసభ్యులన్నంత స్నేహంగా ఉంటారు. ఒకరిండ్లలో వేడుకలకు మరొకరిని సాదరంగా ఆహ్వానిస్తారు. అందరూ కలిసి గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఇంటికి ఇద్దరైనా వివిధ భారతి అభిమానులు ఉంటారు. నేత పనిలో వారికి బడలిక తెలియకుండా చేస్తున్నది రేడియోనే! నేతన్నల ఇంట్లో ఉదయం ఆరుగంటలకు మొదలయ్యే రేడియో రాత్రి పదకొండు గంటలకు గానీ ఆగదు. పోగులు పోసేటప్పుడు, ఆసు తిప్పేటప్పుడు, చీర నేసేటప్పుడు, రంగులు అద్దేటప్పుడు ప్రతి సందర్భంలోనూ వివిధ భారతి పాటలు తోడుగా ఉండాల్సిందే! భూదాన్ పోచంపల్లిలో శ్రోతల సమావేశాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వారి జీవితాల్లో 102.8 ప్రాధాన్యం ఎంతలా ఉండేదో ఊహించుకోవచ్చు.
విఖ్యాత వ్యాఖ్యాతలు
మరీ ఇంత అభిమానం ఏర్పర్చుకోవడానికి ఏముంది అందులో అనుకోవచ్చు. ఈ రోజుల్లో పాటలు ఎక్కడైనా వినొచ్చు. సెల్ఫోన్లో మీట నొక్కితే నచ్చిన సంగీత దర్శకుడి పాటలు, హీరో పాటలు, కథానాయిక పాటలు కోకొల్లలుగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. అప్పటికింకా టీవీ తెలియదు, టేప్ రికార్డర్లూ సంపన్నులకే చెందేవి. మధ్యతరగతి వారింట రేడియో ఉంటే మహారాజులే! అదే వారి కాలక్షేపం. అందులో వచ్చే పాటలే ఆటవిడుపు. ప్రయోక్తల మాటలే జీవిత పాఠాలు. అందుకే వివిధ భారతితో అంతగా మమేకం అయ్యారు. హైదరాబాద్-ఏ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు, వార్తలు, నాటకాలు, సినిమా విశేషాలు ఎన్ని ఉన్నా.. వివిధ భారతి దగ్గరికి వచ్చే సరికి, తమదనే భావనతో తాదాత్మ్యం చెందేవారు. అందులో ప్రసారమయ్యే కార్యక్రమాలు మాత్రమే ఇందుకు కారణం కాదు. వాటిని ప్రసారం చేసే వ్యాఖ్యాతలు కూడా! ఆ పాత తరంలో ఉమాపతి బాలాంజనేయ శర్మ, మట్టపల్లి రావు, ఇందిరా బెనర్జీ, శారద, ఇలియాస్ అహమ్మద్ తదితర వ్యాఖ్యాతలు మధురమైన భాషణంతో శ్రోతల మనసులను కొల్లగొట్టారు. ఆ తర్వాతి తరంలో వి.వి.రామారావు శ్రోతలకు మరింత చేరువయ్యారు. రాజబాబు, బాలకృష్ణ, ప్రసన్నలక్ష్మి, అనుపమ, నాగమణి తదితర వ్యాఖ్యాతలు సందర్భోచితమైన మాటలతో ప్రసారాలను రక్తికట్టిస్తుంటారు. అందుకే, శ్రోతలు పాటల కన్నా వారి మాటలకు మరింత సంతృప్తి చెందేవారు. వారిండ్లలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే సొంతింటి సభ్యుల్లా హాజరయ్యేవారు. వారికేమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెళ్లి పరామర్శించేవాళ్లు. గుళ్లూ గోపురాల్లో అర్చనలు చేయించిన దాఖలాలూ ఉన్నాయి.
విజ్ఞాన ‘హరివిల్లు’
వివిధ భారతిలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాల్లోకి వెళ్తే.. జనరంజని ప్రధాన ఆకర్షణ. మణిమాల, సంధ్యారాగం, భావన, శుభరాత్రి తదితర కార్యక్రమాలు లక్షలాది హృదయాలను కొల్లగొట్టాయి. 2005లో మొదలైన హరివిల్లుది ప్రత్యేక ప్రస్థానమని అంటారు శ్రోతలు. రోజుకో విషయంతో అలరించేదా కార్యక్రమం. సందర్భోచితమైన పాటలతో రసరమ్యంగా సాగిపోయేది. శివరాత్రి, రామనవమి, దసరా నవరాత్రులు ఇలా పర్వదినాల్లో ప్రత్యేక ‘హరివిల్లు’ నిర్వహించేవారు. పండుగలప్పుడు ‘హరివిలు’్ల తనతోపాటు వీధిలోని వారంతా వినాలనే సదుద్దేశంతో భువనగిరికి చెందిన ఒక శ్రోత స్పీకర్లు పెట్టి వినిపించేవాడట. హైదరాబాద్కు చెందిన ఫొటోగ్రాఫర్ వేణుగోపాల్ అయితే హరివిల్లు కార్యక్రమాలను రికార్డు చేసి పదిలపరుచుకున్నారు. భూదాన్ పోచంపల్లికి చెందిన మరో శ్రోత కూడా హరివిల్లు రికార్డు చేసుకోవడం విశేషం. అంతేకాదు, హరివిల్లును జనరంజకంగా సమర్పించిన వివి రామారావుకైతే శ్రోతలు ఏకంగా విజ్ఞాన వినోద రామారావు అనే కితాబునూ ఇచ్చారు. వివిధ భారతి చుట్టూ ఇలాంటి స్వచ్ఛమైన అభిమానుల కోలాహలం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నది.
హలో.. హలో..!
హరివిల్లుతోపాటు అందరినీ కట్టిపడేసిన మరో కార్యక్రమం ‘హలో ఎఫ్ఎమ్’. శ్రోతలు నేరుగా ఫోన్లో మాట్లాడి వారడిగిన పాటను ప్రసారం చేయమని కోరేవారు. ఫోన్ చేసి పాట కోరడంలో గొప్పేముంది అనుకోకండి. ఈ ఫోన్లు కొందరి జీవితాలను మార్చేశాయి. జీవితంపై కొందరి దృక్పథాలను మార్చేశాయి. ఈ కార్యక్రమం నిర్వహించే వ్యాఖ్యాతలతో మాట్లాడి రేడియో అనౌన్సర్లుగా స్థిరపడిన వారున్నారు. తన రచనాసక్తిని వ్యాఖ్యాతతో పంచుకొని, వారి ప్రోత్సాహంతో కవయిత్రిగా మారిన సాధారణ గృహిణీ ఉన్నది. వరుసగా రెండు రోజులు ఫోన్ కలిస్తే గిన్నిస్ రికార్డ్ సాధించామన్నంతగా ఉబ్బితబ్బిబ్బయ్యే వారూ ఉన్నారు. స్వీయ నియంత్రణను పాటిస్తూ మూడు మాసాలకోసారి మాత్రమే గొంతు కలిపే వాళ్లూ ఉన్నారు. ఈ లిస్టులో సెల్ఫోన్ సిగ్నల్ కోసం చిటారు కొండన చేరి ‘హలో ఎఫ్ఎమ్’ను పలుకరించే గొర్రెల కాపరీ ఉన్నాడు. తన పరిశోధన గురించి రేడియోతో పంచుకున్న శాస్త్రవేత్తా ఉన్నాడు. ఓ కార్యక్రమంతో ఇంతలా మమేకం అవ్వడం ఏంటని ఆశ్చర్యం కలుగకపోదు. కానీ, వివిధ భారతి ఓ కుటుంబం. ఇందులో స్టేషన్ డైరెక్టర్లు ఇంటిపెద్దలు. వ్యాఖ్యాతలు తల్లిదండ్రులు. శ్రోతలందరూ పిల్లలే. యాభై వసంతాల ఈ విచిత్ర కుటుంబం మరో వందేండ్లు కన్నులపండువగా వర్ధిల్లాలని కోరుకుందాం. ఇంకో వెయ్యేండ్లు వీనుల విందులను పంచాలని ఆశిద్దాం. శ్రోతల అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
కొసమెరుపు: ‘ఏక్ తాజ్మహల్.. ఏక్ లతామంగేష్కర్.. ఏక్ వివిధ భారతి’ అని ముంబయి వివిధ భారతి తన ప్రత్యేకతను చాటి చెబుతుంటుంది. శ్రోతల మదిలో హైదరాబాద్ వివిధ భారతి స్థానం కూడా అంతే ప్రత్యేకమైంది. కానీ, కొన్ని నెలల కిందట వివిధ భారతిలో ఆధునిక పోకడలు తొంగి చూశాయని కలత చెందుతున్నారు శ్రోతలు. కాలానుగుణంగా కొత్తకు ఆహ్వానం పలుకడం మంచిదే అయినా, మధుర గీతాలు తగ్గాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. యాభై వసంతాల పండుగ జరుపుకొంటున్న ఈ సందర్భంగా తమ మనసెరిగి కార్యక్రమాల ప్రసారంపై పునఃసమీక్ష చేయాలని కోరుతున్నారు శ్రోతలు.
ఎందరో మహానుభావులు
వివిధ భారతికి సాధారణ జనాలు మాత్రమే కాదు, సెలబ్రిటీలూ అభిమానులే! వారే స్వయంగా స్టేషన్కు వచ్చి కార్యక్రమాలు నిర్వహించిన రోజులూ ఉన్నాయి. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి, గాన గంధర్వుడు ఘంటసాల, రావు బాలసర్వతి, పి.సుశీల, షావుకారు జానకి, అల్లూ రామలింగయ్య, పీబీ శ్రీనివాస్, తదితర లబ్ధప్రతిష్ఠులు ప్రత్యేకంగా జనరంజని సమర్పించారు. వారు నటించిన పాటలు, వారికి నచ్చిన పాటలను ప్రసారం చేస్తూ, నాలుగు మంచి మాటలు చెప్పి అలరించారు. ‘ఈవారం అతిథి’ పేరుతో ప్రతి ఆదివారం ఓ ప్రముఖ వ్యక్తితో ఇంటర్వ్యూ నిర్వహించేవారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మణిశర్మ, దర్శకుడు వంశీ తదితర సెలబ్రిటీలు వారి అనుభవాలను పంచుకున్న తీరు అద్భుతమనిపిస్తుంది.
ఈ తరానికీ చేరువగా
ఆ పాత తరాన్నే కాదు, యువతనూ ఆకర్షించడానికి వివిధ భారతి వివిధ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. వివిధ భారతి శబ్ద భాండాగారంలోని అందమైన కార్యక్రమాలను వెలికి తీసి.. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రముఖులు సమర్పించిన జనరంజని, ఆనాటి మేటి తారల పరిచయాలు, ప్రత్యేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఏ వేళలో అయినా వినే వెసులుబాటు కల్పించారు. మొబైల్ యాప్ (air prasarabharati) రూపంలోనూ వివిధ భారతి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ వివిధ భారతితోపాటు మార్కాపురం, కర్నూలు ఎఫ్ఎమ్ కార్యక్రమాలనూ ఈ యప్ ద్వారా లైవ్గా వినే అవకాశం ఉన్నది. ఇలా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నవ తరానికీ చేరువ అవుతున్నది.
ప్రసారాలు ఇలా
2005 వరకు వివిధ భారతి ఉదయం ప్రసారాలు ఉదయం 9 గంటలకే ముగిసేవి. మధ్యాహ్నం 11 గంటలకు రెండో విడత ప్రసారాలు మొదలయ్యేవి. 9 నుంచి 11 గంటల మధ్య సమయాన్ని పసందైన కార్యక్రమాలతో నింపారు. అవే జనరంజని, ఏకచిత్రగానం, హరివిల్లు. కొన్నాళ్లకు ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు హరివిల్లు ప్రసారం చేసి, 11 నుంచి 12 గంటల వరకు ‘హలో ఎఫ్ఎమ్’ శీర్షికతో శ్రోతలతో లైవ్ ఫోన్ఇన్ కార్యక్రమం కొనసాగించారు. అన్ని రంగాల్లో మార్పులు జరుగుతున్నట్టే.. 102.8 ఎఫ్ఎమ్ ప్రసారాల్లోనూ కొత్తదనం వస్తున్నది. దానిని రిసీవ్ చేసుకోవడానికి శ్రోతలకు కాస్త సమయం పట్టొచ్చు. కానీ, ఈ మార్పులను స్వాగతించాల్సిందే అంటారు విశ్రాంత వ్యాఖ్యాత వి.వి.రామారావు వంటి వారు.
ఎన్నెన్ని గీతాలో
ఓ శ్రోత అలనాటి మల్లీశ్వరిలోని ‘మనసున మల్లెల మాలలూగనే.. ’ పాట కోరితే, మరొకరు ‘మల్లీశ్వరివే.. మధురాశల మంజరివే..’ అడుగుతారు. ఓ పెద్దాయన దేవులపల్లి వారి ‘చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు..’అన్న జావళీ కావాలని అడిగితే, మధ్యవయస్కుడు ‘నువ్వేన.. సంపంగి పువ్వున నువ్వేనా..’ ప్లే చేయమంటారు. ఒక్కొక్కరి అభిరుచీ ఒక్కోరకంగా ఉంటుంది. అన్నిటినీ స్వాగతిస్తుంది వివిధ భారతి. అందుకే, ఎక్కడా వినిపించని అరుదైన పాటలు రేడియోలో అలరిస్తుంటాయి. ఇంటర్నెట్లో సెర్చించినా దొరకని ఆపాత మధురాలు ఇక్కడ వందల్లో వినిపిస్తాయి. యూట్యూబ్లో లభించని పాటలు సైతం ఇక్కడ మార్మోగుతుంటాయి. కొత్తాపాత మేలుకలయికతో పాటలు ప్రసారం అవుతుంటాయి. రచయితల కలం పరిమళాలు, గాయకుల గళ విన్యాసాలు, రాగాల్లోని సారుప్యతలు, భావాల్లోని వైవిధ్యాలు ఇవన్నీ సామాన్య శ్రోతకు ‘గీతా’సారమే! ‘బృందావనం’లో ‘తారా తోరణం’లో విహరిస్తూ ‘పాటల పల్లకీ’లో ఊరేగుతూ ‘హరివిల్లు’ విరిసినంత ఆనందంగా ఆస్వాదిస్తారు. ‘సంధ్యారాగ’పు సరిగమల్లో తడిసి ముద్దయిపోతారు.
‘అభిమాన సంఘ’సేవ
ఏండ్లు గడుస్తున్నా వివిధ భారతి శ్రోతల మధ్య అనుబంధాలు చెక్కుచెదరలేదు. వారంతా ఒక్కతాటిపై ఉండాలని, రేడియోలో కార్యక్రమాలు మరింత ఆకర్షణీయంగా మార్చాలనే సంకల్పంతో పలు సంఘాలు ఏర్పర్చుకున్నారు. 1978లోనే ‘భాగ్యనగర్ రేడియో శ్రోతలు’ పేరుతో ఒక అసోసియేషన్ను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఆనాటి శ్రోతలు దగ్గు మహేశ్ కుమార్, కె. హరనాథ్, అందేపాక నరహరి, ఎస్.దుర్గారెడ్డి తదితరులు ఈ సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటికి రేడియో వ్యాఖ్యాతలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి సాదరంగా సన్మానించుకునేవారు. అంతేకాదు, వరదలు, కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు తోచినంత నిధులు సేకరించి అవసరార్థులకు పంచేవారు. ‘వివిధ భారతి అభిమాన సంఘం’ పేరుతో బృందంగా ఏర్పడిన అభిమానులు వారి అభిప్రాయాలను కలివిడిగా పంచుకునేవారు. 1986లో పబ్లిక్ గార్డెన్స్లో సంఘం ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆనాటి ఆహ్వాన పత్రికలో ‘ఈ కార్యక్రమానికి ఒక రేడియో వ్యాఖ్యాత అధ్యక్షత వహించెదరు’ అని కొసమెరుపుగా ప్రకటించుకున్నారంటే వ్యాఖ్యాతలపై వారికి అభిమానం ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. తర్వాతి కాలంలో రాష్ట్రస్థాయి అభిమాన సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్నాళ్లు నెలకోసారి అందరూ కలుసుకొని ఆటపాటలతో సరదాగా కాలక్షేపం చేసేవారు. వీటికి వ్యాఖ్యాతలను పిలిచి వారి అభిమానం చాటుకునేవారు. ఇప్పటికీ వీరంతా ‘రేడియో నేస్తం’, ‘ఆకాశవాణి ఆత్మీయనేస్తం’ వంటి వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకొని రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.
అరుదైన బడి
వివిధ భారతి కుటుంబంలో నిరక్ష్యరాస్యులున్నారు. విద్యాధికులున్నారు. వివిధ భారతి వినోదాన్ని అందించే వేదిక మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాల కూడా. అమ్మ ఒడిలో మాతృభాష నేర్చుకున్న తాము ఆకాశవాణి సహచర్యంతో భాషలోని సౌందర్యాన్ని ఒడిసిపట్టుకున్నామని అంటారు శ్రోతలు. ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న మలక్పేటకు చెందిన రాధ వివిధ భారతి బడిలోనే ఎన్నో విషయాలపై పట్టు సాధించారు. తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన రేడియోకు సదా కృతజ్ఞురాలినని అంటారామె. రేడియో తనకు తల్లితో సమానమని చెబుతారు శ్రోత, అడ్వకేట్ వనం దుష్యంతల. ‘వివిధ భారతి ప్రసారాలు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. వాటి ద్వారా రమ్యమైన భాషతో పాటు రసరమ్య సంగీతాన్నీ నేర్చుకున్నా. ఒకప్పుడు నలుగురిలో మాట్లాడాలంటేనే బెరుకుగా భావించే నేను ఇప్పుడు మాట్లాడటమే కాదు, పాటలు కూడా పాడగలుగుతున్నాన’ని చెప్పుకొచ్చారు.