హైదరాబాద్ : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిన అనివార్యత ఉందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గువ్వల బాలరాజు శాసనసభలో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గవర్నర్ తమిళిసై ప్రజల కళ్ల ముందుంచారు. సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ రాష్ర్టం భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీరును ఇస్తుందన్నారు. ఈ పథకానికి కేంద్రం సహాయం చేయలేదు.. కేవలం ప్రశంసలకే పరిమితం అయ్యారు. రాష్ర్ట ప్రజల ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుపడిందన్నారు. గ్రామాలతో పాటు ప్రతి తండాకు భగీరథ నీళ్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు.
రాష్ర్టం ఏర్పడిన కొద్ది నెలల్లోనే విద్యుత్ సమస్యలను అధిగమించామని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిపి.. సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని తెలిపారు. కానీ ఇవాళ కొంతమంది నాయకులు సీఎం కేసీఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడటం దారుణమన్నారు. విమర్శలు చేసే నాయకులు ఎవరైనా సరే గవర్నర్ ప్రసంగంతోనైనా మేలుకోవాలని సూచించారు.
పాలమూరు ప్రాజెక్టులకు కొంతమంది నాయకులు అడ్డుపడి రైతుల పాపాన్ని మూటగట్టుకున్నారని ధ్వజమెత్తారు. గత పాలకుల వల్లే పాలమూరు వలస జిల్లాగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్.. దానికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరినా.. ఉలుకు పలుకు లేదన్నారు. రైతులకు సీఎం కేసీఆర్పై ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాల్సిన అనివార్యత ఉందన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు గమనించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమైనా కోటి ఎకరాల మాగాణాన్ని త్వరలోనే చూడబోతున్నామని తెలిపారు. గవర్నర్కు ఈ ప్రభుత్వంపై అత్యంత విశ్వాసం చూపారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మాటలు కేసీఆర్ పట్టించుకోకుండా.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గొప్పగొప్ప పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు అని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.