యాదాద్రి: యాదాద్రిలో రూ. 30 కోట్ల వ్యయంతో అధునాతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి మున్నూరుకాపు నిత్యన్నదానం సత్రం ఛారిటబుల్ ట్రస్ట్ భవ నాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్తో కలిసి ట్రస్ట్ చైర్మన్, శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ నేతి విద్యా సాగర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
యాదాద్రీశుడి సన్నిధిలో అధునాతన భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ట్రస్టు సభ్యులు, మున్నూరు సభ్యులను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు ట్రస్టు సభ్యులు సర్ధార్ పుట్టం పురుషోత్తం, మున్నూరు కాపు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
ట్రస్ట్ చైర్మన్, మున్నూరుకాపు కులస్తులకు అభినందనలు తెలిపిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్టలో మున్నూరు కాపు నిత్యన్నదాన సత్రం ఛారిటబుల్ ట్రస్ట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్తోపాటు ట్రస్టు సభ్యులు, రాష్ట్ర మున్నూరు కాపు కులస్తులకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ప్రారంభమైన మున్నూరు కాపు భవనాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నేతి విద్యాసాగర్ను కలిసి మాట్లాడారు.