సీఎం కేసీఆర్ కోసం త్యాగం చేయలేదు
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 15: కేసీఆర్ కోసం జానారెడ్డి సీఎం పదవి త్యాగం చేశారని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని, అసలు జానారెడ్డికి సీఎం పదవి కాదు కదా.. పీసీసీ పదవి ఆఫర్ కూడా రాలేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే రోశయ్య పేరు, ఆ తర్వాత కిరణ్కుమార్రెడ్డి పేరు ప్రతిపాదించిందని, జానారెడ్డి పేరు అసలు ప్రస్తావనకే రాలేదన్నారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తే, ఎంపీలుగా తామంతా కేసీఆర్కు సీఎం పదవి ఇవ్వాలని కోరామన్నారు. జానారెడ్డితోపాటు ఇంకొందరు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు లేకుండానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని తెలిపారు.
తెలంగాణ వచ్చాక కాంగ్రెస్లో అందరూ సీఎం అభ్యర్థులేనని, అందులో చాలామందికి డిపాజిట్ కూడా రాలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ వచ్చిందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసిన కాంగ్రెస్ నేతలు సంతోషించకుండా.. అధికారం రాలేదని బాధలో ఉన్నారని అన్నారు. నోముల నర్సింహయ్యకు అన్యాయం జరిగిందని రేవంత్రెడ్డి అనే మాటల్లో అర్థం లేదన్నారు. నోముల మీద ఉన్న ప్రేమతో 2014లో ఓడిపోయినా ఇంచార్జి బాధ్యతలు ఇచ్చి 2018లో మరోసారి టికెట్ ఇచ్చి గెలిపించారని, ఆయన మరణాంతరం ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఎలా అన్యాయం చేశారని ప్రశ్నించారు. నోముల మీద ప్రేమ ఉంటే జానారెడ్డి తప్పుకొని భగత్ను ఎమ్మెల్యే చేయండని సూచించారు. జానా గెలిస్తే ఆయనకే పీసీసీ వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి కలిసి గెలువవద్దనే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.