కంటోన్మెంట్, జూలై 12 : నాలుగు నెలల విరామం అనంతరం కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్, బజార్లకు సం బంధించిన స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. కంటోన్మెంట్ అధికారులు సివిల్, బజార్ ప్రాంతాల్లోని స్థలాలకు రిజిస్ట్రేషన్లను ఆపాలని బోయిన్పల్లి సబ్ రిజిస్ట్రార్కు ఆదేశాలు ఇవ్వడంతో మార్చి నెల నుంచి జూలై 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో బోర్డు పరిధిలోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి బోర్డు మాజీ సభ్యులు సివిల్, బజార్లకు చెందిన ప్రజలతో చర్చించి ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డు సందర్శనకు వచ్చిన డీజీడీఈ ప్రచూర్ గోయెల్ను ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల నేతృత్వంలో బోర్డు సభ్యులు కలిసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయడంపై వినతిపత్రం అందజేశారు.
దీనికి సానుకూలంగా స్పందించిన డీజీడీఈ కంటోన్మెంట్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడంతో నాలుగు రోజుల కిందట బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, కంటోన్మెంట్ సీఈఓ అజిత్రెడ్డిలు తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని జూలై 12 నుంచి యథావిధిగా సివిల్, బజార్ స్థలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలోని బోర్డు సభ్యులు బోయిన్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ సందర్భంగా జక్కుల మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. తమ పార్టీ ఒత్తిడి కారణంగానే అధికారులు దిగొచ్చారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, పాల్గొన్నారు.