హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల విద్యార్థులు చదువులతోపాటు విభిన్న క్రీడల్లోనూ రాణిస్తున్నారు. సెయిలింగ్ వంటి ఖరీదైన, కఠినమైన, సాహసక్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. తాజాగా ఆరుగురు జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు సెయిలింగ్కు ఎంపికయ్యారు. వీరిలో 8, 9వ తరగతి విద్యార్థులు కే అభిరామ్, కే నితిన్, జీ మల్లేశ్, కార్తీక్ ఇండియన్ నేవీకి ఎంపికయ్యారు. మరో ఇద్దరు సీ సంతోష్, ఆర్ చింటూ ఆర్మీకి ఎంపికయ్యారు. ఈ ఆరుగురు విద్యార్థులు వచ్చే జూలై 4న నిర్వహించే ఏషియన్ గేమ్స్ అర్హత పోటీలకు ఎంపికవ్వడం మరో విశే షం. వీరి ప్రతిభ ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో టీ శాట్ నెట్వర్క్ చానెల్లో గురువారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఎంపికైన ఆరుగురు బీసీ గురుకుల విద్యార్థులు గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను హైదరాబాద్లో మంత్రుల నివాసంలో కలిశారు. మంత్రి వారిని అభినందించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.