హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్థాపించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు తెరలేస్తున్నది. రిజిస్ట్రేషన్కు అవకాశం లేని భూములను ఆ కంపెనీలు అక్రమంగా కొనుగోలు చేయడమే కాకుండా.. నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకుల నుంచి పెద్దఎత్తున రుణాలను తీసుకున్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ఈటల రాజేందర్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పలు కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్టు తన దృష్టికి వచ్చిందని, ఈ వ్యవహారంపై విచారణ జరుపాలని విజ్ఞప్తిచేశారు. ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులు స్థాపించిన జమున హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జమున ఫార్మాస్యూటికల్స్, బ్రిడ్జ్ ఆర్ జేబీ అక్రమాలకు పాల్పడ్డాయని తెలిపారు. ఇవి ప్రస్తుతం ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులైన ఈటల జమున, ఈటల నితిన్రెడ్డి, ఈటల క్షమితరెడ్డి నేతృత్వంలో నడుస్తున్నాయని వివరించారు. ఈ కంపెనీల భూములను హైదరాబాద్ అబిడ్స్ కెనరా బ్యాంక్ శాఖలో తనఖాపెట్టి 2012 జూన్ 4వ తేదీ నుంచి లోన్లు తీసుకొన్నారని పేర్కొన్నారు. తర్వాత అచ్చంపేట, పూడూర్, హకీంపేట, దేవరయాంజాల్లో భూములను కొనుగోలు చేసినట్టు పత్రాలను సమర్పించి బ్యాంకు నుంచి గతేడాది ఫిబ్రవరి 6వ తేదీన అదనంగా రూ.28.25 కోట్ల రుణం తీసుకున్నారని తెలిపారు. వారు సమర్పించిన పట్టాల్లోని సర్వేనంబర్ 56/డీ, 57/బీ, 57/సీ, 58/డీ లోని భూములు దేవాదాయ భూములని పేర్కొంటూ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉంచిందని, ఈ భూములను ధరణిలో సైతం నమోదు చేయలేదని తెలిపారు. దేవాదాయ భూములకు అక్రమంగా పట్టాలను సృష్టించడమే కాకుండా కెనరా బ్యాంక్ అధికారులను, 400 ఏండ్ల చరిత్ర కలిగిన దేవస్థానాన్ని మోసం చేశారని వివరించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ సైతం నిపుణులతో విచారణ జరిపించి అవకతవకలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఈటల రాజేందర్, ఈటల జమున, ఈటల నితిన్రెడ్డి, క్షమిత లోక, మరికొంత మందితో మిలాఖత్ అయ్యి శామీర్పేట మండలంలోని 57/ఈ, 57/డీ, 56/డీ, 57/బీ, 58/సీ సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చారని, వాటి ద్వారా లోన్లు తీసుకుని లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు విచారణ జరిపినా, ఏయే భూములు అన్యాక్రాంతం అయ్యాయో మాత్రమే గుర్తించారని చెప్పారు. ఈ ఆర్థిక నేరంపై కంపెనీల చట్టం ప్రకారం విచారణ జరిపే అధికారం వారికి లేదన్నారు. కాబట్టి అక్రమాలు కండ్లెదుటే కనిపిస్తున్నా, వారిని వదిలేయడంభావ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ భూములకు అక్రమంగా పట్టాలు పొందినందుకు కంపెనీల చట్టం 2013లోని సెక్షన్లు 212, 447, 449, 451, 450, 452 ప్రకారం జమున హ్యాచరీస్, జమున ఫార్మాస్యూటికల్స్, బ్రిడ్జ్ ఆర్ జేబీ కంపెనీలపై విచారణ జరుపాలని విన్నవించారు.