కమలాపూర్, జూన్ 18: ఇరవై ఏండ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తమ గ్రామానికి చేసిందేమీ లేదని, పైగా కనగర్తి గ్రామస్థులతో తలకాయలు పగులకొట్టించ్చిండని గుండేడు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఈటల రాజేందర్ దౌర్జన్యాలను ఏకరువు పెట్టారు. ఇరవై ఏండ్లనుంచి తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈటల రాజేందర్ పట్టించుకోలేదని గుండేడు గ్రామ మాజీ ఉపసర్పంచ్ మహీధర్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
కరీంనగర్ జిల్లా కనగర్తికి చెందిన ముదిరాజ్లు తమ గ్రామంలోని గుండ్ల చెరువులో చేపలు పట్టే విషయంలో దాడులు చేసి తలలు పగులగొట్టారని గుర్తుచేశారు. రెండు గ్రామాల మధ్య భయానక వాతావరణం సృష్టించడమే కాకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ పెట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. సొంత గ్రామంలో భయంతో బతికామని, సమస్య పరిష్కారం కోసం ఈటల రాజేందర్ వద్దకు వెళ్తే వెకిలిగా నవ్వి అవమానించాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానంటున్న ఈటల రాజేందర్..‘కనగర్తి ముదిరాజులతో కొట్టించ్చినప్పుడు మా ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా’ అని ప్రశ్నించారు. తమ గ్రామ సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డికి గ్రామస్థులు విన్నవించారు. దాంతో గ్రామంలో సమస్యలు తెలుసుకొనేందుకే వచ్చానని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆస్తుల కోసం బీజేపీలో చేరిన ఈటలకు మద్దతు ఇచ్చేది లేదని, సీఎం కేసీఆర్తోనే ఉంటామని, టీఆర్ఎస్కే ఓటేస్తామంటూ గ్రామస్థులు స్పష్టంచేశారు.
కనగర్తి-గుండేడు గ్రామాల మధ్య గుండ్ల చెరువు చేపల వివాదంలో కనగర్తి ముదిరాజ్లు దాడులు చేస్తే ఈటల రాజేందర్ కనీసం పట్టించుకోకపోగా సమస్య పరిష్కారం కోసం పోతే మమ్మల్ని అవమానించారు. 40 ఏండ్లు మా తండ్రి గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. ఎలాంటి గొడవలు లేకుండా ఉండే మా గ్రామంలో కనగర్తి గ్రామస్థులతో దెబ్బలుపడ్డాం. పోలీస్ పికెట్ పెట్టించి మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు.
-మహీధర్రావు, మాజీ ఉపసర్పంచ్
బ్రిడ్జి అన్నడు, చెక్ డ్యాంలు అన్నడు. డబుల్ బెడ్రూం ఇండ్లు తెస్త అన్నడు. ఇప్పటికీ మా గ్రామంలో ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేయలేదు. గ్రామాభివృద్ధి కోసం వెళ్తే మారుమాల గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతదన్నడు. ఇప్పుడు పక్క నియోజకవర్గం పరకాల ఎమ్మెల్యే మీ ఊరికి ఏం కావాలని అడుగుతున్నరు. కానీ ఈటల రాజేందర్ ఏనాడూ మా గ్రామ అభివృద్ధిని పట్టించుకోలే.
–ఆకునూరి సంపత్, గుండేడు వాసి