సాయంత్రానికి తీరం దాటే అవకాశం
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హెచ్చరిక జారీ చేసిన వాతావరణశాఖ
హైదరాబాద్, సెప్టెంబర్26(నమస్తే తెలంగాణ): గులాబ్ తుఫాన్ ముంచుకు వస్తున్నది. గోపాలపూర్కు 310, కళింగపట్నంకు 380 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో గులాబ్ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నది. ఈ రోజు సాయంత్రం కళింగపట్నం – గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అలజడిగా ఉందని, మత్స్య కారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, జోగులాంబగద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రిభువనగిరి సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట,భద్రాద్రికొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నది. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను 12.43, రాంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ 10.93, సంగారెడ్డి జిల్లా కేంద్రం 9.10, హైదరాబాద్ జిల్లా షేక్పేట8.90, ఫిల్మ్నగర్8.55, నల్లగొండ జిల్లా గుర్రంపోడు8.48 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని తెలిపింది.