హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సందర్భంగా కార్మికుల జీవనోపాధికి అంతరాయం ఏర్పడకుండా పరిశ్రమలు కొనసాగేలా ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీచేసింది. తయారీరంగానికి సంబంధించిన అన్ని పరిశ్రమలు కొవిడ్ నిబంధనల ప్రకారం కొనసాగుతాయని తెలిపింది. టెలి కమ్యునికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, ఐటీ ఆధారిత రంగాలు పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో కొనసాగించుకోవచ్చని, మిగిలినవారు వర్క్ఫ్రమ్ హోం పద్ధతిలో పనిచేస్తారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మెడికల్, ఫైనాన్స్, రవాణా తదితర కీలకరంగాలకు అవసరమైన డాటా నిర్వహణ కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయన్నారు. కోల్డ్ స్టోరేజీలు, వేర్హౌసింగ్ సేవలు, రవాణా, సరుకు రవాణా, కార్మికుల రవాణా, పరిశ్రమలు, గ్యాస్ పైప్లైన్ల తవ్వకాలు, ఈ-కామర్స్ సేవలు, హోమ్ డెలివరీ సేవలు, విద్యుత్తు తయారీ, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సేవలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల రాకపోకలు లాక్డౌన్ రిలాగ్జేషన్ సమయంలోనే జరగాలని, ఈ మేరకు పరిశ్రమల ప్రాగణంలోనే వారికోసం తగిన వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికులు ప్రయాణించాలంటే వారి గుర్తింపుకార్డు, పరిశ్రమ జారీచేసిన అనుమతి పత్రాలు తప్పనిసరి అని స్పష్టంచేశారు. పరిశ్రమల వద్ద బాడీ టెంపరేచర్ స్కాన్ను ఏర్పాటుచేయాలని, పాజిటివ్ అని తేలితే చికిత్సకు అనుమతించి, ఆ కాలానికి వేతనం చెల్లించాలన్నారు. కరోనా కారణంతో విధులనుంచి తొలగించరాదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది.