హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అడ్మిషన్లు అధికంగా ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకంసహా అన్ని వసతులు సమకూర్చాలని చూస్తున్నది. ఇదే అంశంపై సోమవారం ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్తో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి సమీక్షించారు. ఫలక్నుమా, బోరబండసహా అడ్మిషన్లు అధికంగా ఉన్న 20కి పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతుల కల్పనపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని 405 కాలేజీల్లో 1.14 లక్షల మందికిపైగా విద్యార్థులు చేరారు. ప్రత్యక్ష తరగతులకు భారీగానే విద్యార్థులు హాజరవుతుండటంతో లెక్చరర్ల కొరత వేధిస్తున్నది. కాగా, త్వరలోనే గెస్ట్ఫ్యాకల్టీని నియమిస్తామని మంత్రి సబిత తమకు హామీ ఇచ్చినట్టు సోమవారం ఇంటర్ విద్య జేఏసీ నేతలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో జేఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపాళ్ల సంఘం నాయకులు కళింగ కృష్ణకుమార్, రామానుజాచారి, ధర్మేంద్ర, వీ ఆంజనేయరావు, రజిత, కవితకిరణ్, రాణి తదితరులున్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్లను పన్ను నుంచి మినహాయించండి
కాంట్రాక్ట్ లెక్చరర్లను ఆదాయం పన్ను నుంచి మినహాయించాలని ఇంటర్ విద్య పరిరక్షణ సమితి, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్కు వినతిపత్రాన్ని సమర్పించారు.