హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) జనరల్ మేనేజర్ దీప్తి కరోనాతో మృతిచెందారు. 2007 గ్రూప్-1 అధికారిణి దీప్తి రాష్ట్ర ఆడిట్శాఖ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. డిప్యూటేషన్పై టీఎస్ఎండీసీ జీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైరస్ తీవ్రతతో ఆమె వారంరోజుల క్రితం కిమ్స్ దవాఖానలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. 1992లో ఐఎస్ఐ ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అడిషనల్ ఎస్పీ జీ కృష్ణప్రసాద్ కుమార్తె దీప్తి. తండ్రి మరణించేనాటికి దీప్తి వయస్సు 13 ఏండ్లు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో 2007లో గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించారని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం తెలిపింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, హన్మంత్నాయక్, నాయకులు వేణుమాధవరెడ్డి, విజయ్, పాండురంగారావు, రమేశ్, రేవతి తదితరులు దీప్తి మృతికి సంతాపం ప్రకటించారు. కాగా, 45 రోజుల్లోనే దీప్తి కుటుంబంలో ఐదుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. దీప్తి తల్లితోపాటు పెద్దమ్మ, పెద్దనాన్న, మేనమామ కొవిడ్తో మరణించారు.