ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ వైపు ప్రజలు, వ్యాపారులు అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో రోజువారీగా కేసులు వందకు పైగా దాటిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఇండ్లలో నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు కూడా కరోనా బారిన పడుతుండటంతో దుకాణాలను మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తున్నారు. నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్మెట్, యాచారం, ఇబ్రహీంపట్నం, ఆరుట్ల, మంచాల, దండుమైలారం, ఎలిమినేడు, హయత్నగర్, రాగన్నగూడలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, టీకా కూడా వేస్తున్నారు. ఒకేచోట టీకా, పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఆయా సెంటర్లు ఓ వైపు రోగులు, మరోవైపు టీకా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో పదుల సంఖ్యలో నమోదయ్యే కేసులు వందకుపైగా నమోదవుతున్నాయి.
కొనసాగుతున్న మినీ లాక్డౌన్..
నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛంద లాక్డౌన్వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే యాచారంలో అధికారులు మినీ లాక్డౌన్ను ప్రకటించారు. మధ్యాహ్నం 2గంటల వరకే వ్యాపార సంస్థలు తెరుస్తున్నారు. ప్రజలు కూడా బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుర్కయాంజాల్ తదితర ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం దుకాణాలను మూసివేస్తున్నారు. అత్యవసరముంటేనే ప్రజలకు బయటకు రావాలని పోలీసులు, మున్సిపల్ అధికారులు కోరుతున్నారు.
నియోజకవర్గంలో 85 కేసులు నమోదు..
నియోజకవర్గంలో గురువారం 85 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆయా కరోనా పరీక్ష కేంద్రాల్లో 290 మందికి పరీక్షలు నిర్వహించగా 85 మందికి కరోనా నిర్ధ్దారణ అయ్యింది. బాధితులకు వైద్యసిబ్బంది మందులు అందజేశారు.
యాచారంలో స్వచ్ఛందంగా బంద్
యాచారం, ఏప్రిల్ 29 : మండల కేంద్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మినీ లాక్డౌన్కు పంచాయతీ తీర్మానించిన విషయం తెలిసిందే. పంచాయతీ నిబంధనలను పాటిస్తూ గురువారం వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. దవాఖానలు, మెడికల్ షాపులు ఎమర్జెన్సీ సేవలు మినహా, మధ్యాహ్నం 2గంటల నుంచి హోటళ్లు, బేకరీలు, వస్ర్తాలయాలు, కిరాణ, మద్యం దుకాణాలు స్వచ్ఛందంగా బంద్చేశారు. ప్రజలు సైతం మధ్యాహ్నంలోపే పూర్తి చేసుకోవడంతో సాగర్ రహదారిపై ప్రజల రద్దీ తగ్గింది. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. లాక్డౌన్తోనే కరోనా నియంత్రణ సాధ్యమని బంద్ నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీ నిబంధనల ప్రకారం లాక్డౌన్ను పకడ్బందీగా చేస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.