హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ఐదేండ్లలో సగటు భూగర్భ జలమట్టం మూడు మీటర్లకుపైగా పెరిగిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (నీటిపారుదల శాఖ) రజత్కుమార్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయ కింద చెరువుల పూడిక తీత, చెక్డ్యామ్లు, రీచార్జ్ షాఫ్ట్ల నిర్మాణం వంటి వినూత్న కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయని చెప్పారు. రజత్కుమార్ అధ్యక్షతన మంగళవారం రాష్ట్రస్థాయి భూగర్భ జలాల అంచనాల నిపుణుల కమిటీ (ఎస్ఎల్ఈసీ) సమావేశం జరిగింది. 2019-20 సంవత్సరానికి రాష్ట్ర భూగర్భ జలశాఖ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జల్శక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అధ్యయనం చేసి రూపొందించిన ‘భూగర్భ జల వనరుల అంచనా’ నివేదికపై చర్చించి, ఆమోదించారు. ఈ సందర్భంగా రజత్కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం పదడుగుల వరకు పెరిగిందని తెలిపారు. గత దశాబ్దపు నీటిమట్టాలతో పోల్చితే గత ఐదేండ్లలో 93 శాతం మండలాల్లో పెరుగుదల గమనించామని చెప్పారు. ఇది దేశంలోనే అత్యధికమని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ జలశాఖ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, రెవెన్యూ తదితర శాఖలు, ఎన్జీఆర్ఐ, ఎన్ఆర్ఎస్సీ, టీఎస్టీఎస్స్సీ, నాబార్డ్ తదితర సంస్థలు, పలు వర్సిటీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.