హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అడుగంటిన భూగర్భ జలాలు ఇది తెలంగాణ నిన్నటి కథ. ఉబికిన పాతాళగంగ మట్టిపొరల్లో ఉరకలు వేయడం ఇది నేటి కథ. కొత్త తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం పరుస్తున్న జలసిరులు, సకాలంలో ఇబ్బడిముబ్బడిగా కురిసిన వర్షాలు భూగర్భ జలాలను తట్టిలేపుతున్నాయి. ఊటలు పొంగులువారిస్తున్నాయి. జమిలి చేయూతతో భూగర్భ జలాలు ప్రతినెలా పైపైకి ఎగబాకుతుంటే తెలంగాణ తేలియాడుతున్నది. గతేడాదితో పోల్చుకుంటే నిన్నటి జూలై నెలలో భూగర్భ జలాలు మరింత పైకి ఎగిసి వచ్చినట్టుగా భూగర్భజలశాఖ చల్లనివార్త చెప్పిం ది. జూలై 2020లో కంటే జూలై 2021లో 3.19 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగిందని తాజా నివేదికలో తెలిపింది. 2020 జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 9.26 మీటర్ల లోతులో ఉంటే.. 2021 జూలైలో 6.07 మీటర్ల వద్దే అందుబాటులోకి వచ్చింది. అంటే 3.19 మీటర్ల మేర ఎగబాకిందని చెప్పుకోవచ్చు. గతేడాది జూలైలో రాష్ట్రంలోనే గరిష్ఠస్థాయిలో 20.77 మీటర్ల లోతులో సంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలుంటే.. ఈయేడు జూలైలో మెదక్లో గరిష్ఠస్థాయిలో 13.79 మీటర్లలో భూగర్భ జలం ఉండటం గమనార్హం.
ఉబికుబికి వస్తున్న నీళ్లు
2020 జూలైలో మెదక్ జిల్లాలో 20.11 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. 2021 మే నెలలో 15.86 మీటర్ల వద్ద లభించాయి. అలాగే మేడ్చల్ జిల్లాలో గతేడాది జూలైలో 12.17 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ఈయేడు మే నెలలో 10.37 మీటర్ల వద్దే అందుతున్నాయి. కామారెడ్డి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నట్టనడి వేసవిలోనూ.. వర్షాకాలంకంటే పైపైకి భూగర్భ జలాలు ఉండటాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఇందుకు ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా గోదావరి నీళ్ళు పారడం.. ఇటు దక్షిణ తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడంతోనే సాధ్యమయ్యింది.
వర్షాకాలం శుభారంభం
నిజానికి చాలాసార్లు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మంచి వర్షాలు కురుస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ వర్షాకాలం సీజన్లో ప్రారంభంలోనే తెలంగాణవ్యాప్తంగా జోరువానలు దంచి కొట్టాయి. జూలై నెలాఖరు నాటికి మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 361 మి.మీ. కాగా.. ఏకంగా 535 మి.మీ. వర్షం కురిసింది. అంటే వర్షాకాలం ప్రారంభంలోనే సాధారణం కంటే సుమారు 48 శాతం వర్షపాతం అధికంగా కురిసింది. దీనితో భూములన్నీ తడిసి.. భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదపడింది. మొత్తం 33 జిల్లాలకుగాను 29 జిల్లాల్లో 21 నుంచి 105 శాతం వరకు అధిక వర్షపాతం నమోదుకాగా.. మిగిలిన నాలుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది.