హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పండించే వేరుశనగకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వేరుశనగ సాగు భారీగా పెరగాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. యాసంగిలో వేరుశనగ ప్రధాన పంటగా మారాలని, ఆ దిశగా రైతులు ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ‘సీడ్ బౌల్ ఆఫ్ గ్రౌండ్నట్’ (వేరుశనగ విత్తన భాండాగారం)గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వేరుశనగ సాగు పెంపు, నూతన వంగడాల తయారీపై శుక్రవారం ఆయన ఇక్రిశాట్, వ్యవసాయ శాఖ, అగ్రి వర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. అయోలిక్ యాసిడ్ అధికంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే అప్లాటాక్సిన్ రహిత వంగడాల తయారీపై ఇక్రిశాట్, వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన జరగాలని సూచించారు. ఇందుకోసం ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.9 కోట్ల అంచనాతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన వనపర్తి వేరుశనగ పరిశోధన కేంద్రానికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గుజరాత్లో వేరుశనగ సాగు అత్యధికంగా ఉన్నప్పటికీ నాణ్యత లేదని, ఇది తెలంగాణ రైతులకు ఎంతో లాభించే అంశమని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు, ఎండీ కేశవులు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు జనీలా, అశోక్, హరికిషన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.