హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమన్వయ కమిటీ మంగళవారంనాడు తొలిసారిగా సమావేశమవుతున్నది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని కార్యాలయంలో ఆగస్టు 3వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్టు రెండు తెలుగు రాష్ర్టాలకు జీఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసింది. సమావేశంలో నీటి పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ ఇటీవల కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ కమిటీలో 11 మంది సభ్యులుంటారు. గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీ కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలో మరో ఇద్దరు బోర్డు సభ్యులు, కేంద్రం నియమించిన అధికారి, తెలంగాణ, ఏపీకి చెందిన సాధారణ, పరిపాలనా విభాగాల ఈఎన్సీలు, ఇరు రాష్ర్టాల ట్రాన్స్కో సీఎండీలు సభ్యులుగా ఉన్నారు.