9 రకాల సమస్యలపై ఫిర్యాదులకు ఆప్షన్
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుకు అవకాశం
పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగింత
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ధరణి పోర్టల్లో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఆధార్ నంబర్ అనుసంధానంలో లోపాలు, పేర్లు, భూ విస్తీర్ణం తప్పుగా నమోదవడం, సర్వే నంబర్ కనిపించకపోవటం తదితర 9 రకాల సమస్యలకు పరిష్కారం చూపేలా ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు సమస్యల పరిష్కారానికి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాలి. ఈ దరఖాస్తులు నేరుగా కలెక్టర్ లాగిన్కు చేరుతాయి. కలెక్టర్ వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటారు. కొనుగోలు, వారసత్వం, భాగ పంపకం ద్వారా సంక్రమించిన భూముల వివరాలు తప్పుగా నమోదైతే 8వ ఆప్షన్ కింద దరఖాస్తు చేయాలి. పట్టా భూములు పొరపాటున ప్రభుత్వ భూమిగా పేర్కొనడం వంటి సమస్యలపై 9వ ఆప్షన్ కింద దరఖాస్తు చేసుకోవాలి.