కొత్తూరు/ నందిగామ : ప్రకృతి వనాలతో పల్లెలు పట్టణ శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూర్ సర్పంచ్ సంతోష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాన్ని సీఎస్ సోమేశ్కుమార్ గురువారం మొక్కనాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పార్కులు అంటే గతంలో పట్టణాల్లో ఉండేవని పల్లెల్లో ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆ ముచ్చట తీరిందన్నారు. ప్రస్తుత రోజుల్లో పట్టణీకరణతో చెట్ల సంఖ్య చాలా తగ్గిందన్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,472 ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 547 మండలాల్లో ఈ బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మండలానికి నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి ఊర్లో ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీని ఏర్పాటుతో గ్రామాల్లో శుభ్రత పెరిగిందన్నారు.
పచ్చదనానికి బడ్టెట్లో 10 శాతం నిధులు
ప్రభుత్వం పచ్చదనానికి బడ్టెట్లో 10 శాతం నిధులు కేటాయిస్తుందని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. పల్లెలతో పాటు ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 1000 కిలోమీటర్ల వరకు మల్టీలెవల్ ప్లాంటేషన్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
అన్ని మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ చెప్పారు. అందులో భాగంగా చేగూర్లోని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని సీఎస్ ప్రారంభించారని చెప్పారు. వారి సలహాలు, సూచనలతో రాష్ట్రంలోని మిగతా వాటిని కూడా వచ్చేనెల వరకు ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అడవులు అంతరించడం వల్ల ఏర్పడే విపత్కర పరిస్థితిలను షాద్నగర్ నియోజకర్గ ప్రజలు చవిచూశారని అన్నారు. తాగు నీటి కోసం అల్లాడామని వివరించారు. ఇప్పడు వర్షాలు బాగా పడి ఆ ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. హరితహారం ద్వారా గ్రామాలు ఎంతో ఆహ్లాదకరంగా తయారయ్యాయన్నారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్రాస్, కలెక్టర్ అమయకుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జిల్లా అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.