నేలతల్లి మురిసింది.. ప్రకృతి పరవశించింది.. చరిత్ర ఏనాడూ ఎరుగని ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్కరోజులోనే తెలంగాణవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ రికార్డు సృష్టించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన ఉద్యమంలా సాగింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రముఖులు మొక్కలు నాటి మంత్రి కేటీఆర్కు అపురూపంగా శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. అందరి భాగస్వామ్యంతో ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటడం విశేషం. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి అతి తక్కువ సమయంలో అద్భుత స్పందన వచ్చింది.
–ఎంపీ సంతోష్కుమార్
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ ): పుడమికి పచ్చని రంగు పులిమారా అన్నట్టు.. పర్యావరణానికి ప్రాణంపోసినట్టు.. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం సంబురంలా సాగింది. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలు, విదేశాల్లో కూడా ముక్కోటి వృక్షార్చన విజయవంతంగా సాగిందని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముక్కోటి వృక్షార్చనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సినిమా, వ్యాపార, పారిశ్రామిక రంగాలవారు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలు లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి అతి తక్కువ సమయంలో అద్భుత స్పందన వచ్చిందన్నారు. ఎంపీ సంతోష్కుమార్ శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. జిల్లాలోని చింతకుంట డబుల్ బెడ్రూం కాలనీ, పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియాల పరిధిలోని అబ్దుల్ కలాం క్రీడా మైదానం, ఇల్లందు గెస్ట్హౌస్, పోలీస్ గెస్ట్హౌస్, అడ్రియాల పోచమ్మ గుడి, సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా చోట్ల మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. చొప్పదండి మండలం వెదురుగట్ట ఫారెస్ట్ ఏరియాలో కేసీఆర్ వనాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం టీఆర్ఎస్ శ్రేణులు లక్షల మొక్కలు నాటి మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.