ఖైరతాబాద్/కూసుమంచి, సెప్టెంబర్ 15: ఒకరి గుండె ఆగింది.. మరొకరిలో అది మోగింది. దాత మలక్పేట యశోద హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్. గ్రహీత నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. దాత నుంచి వేరుచేసిన గుండెను ప్రత్యేకంగా భద్రపర్చి గమ్యం చేర్చాలంటే కాలంతో పరుగెత్తాలి. సమయం మించి తే అవయవం పనికిరాదు. అందుకే పోలీసు బందోబస్తు మధ్య ఆఘమేఘాల మీద తరలిస్తారు.
ఆ 12 నిమిషాలు..
మలక్పేట్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్కు గురైన ఓ వ్యక్తి గుండెను అక్కడి ఐదుగురు వైద్యుల బృందం గంటల వ్యవధిలోనే వేరు చేసి ప్రత్యేక డబ్బాలో భద్రపరిచింది. పోలీసుశాఖ గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయగా 1.44 గంటలకు గుండెతో అంబులెన్స్ మలక్పేట్ నుంచి బయలుదేరింది. చాదర్ఘాట్, కోఠి, గాంధీభవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజగుట్ట మీదుగా నిమ్స్కు 1.56 గంటలకు చేరుకుంది. వెంటనే గుండెను దవాఖానలోని మిలీనియం బ్లాక్ ఒకటో అంతస్తులోని కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగానికి తరలించి ఓ ప్రాణాన్ని నిలబెట్టారు.
ప్రాణదాత వీరబాబు
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలానికి చెందిన ఎన్ వీరబాబు (34) కొండాపూర్లో టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న సొంతపనుల మీద ఖమ్మం జిల్లా గొల్లగూడెం మీదుగా బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన వీరబాబును యశోదకు తరలించారు. వీరబాబు బ్రెయిన్డెడ్ అయిన ట్టు వైద్యులు మంగళవారం నిర్ధారించారు. దీంతో జీవన్దాన్ ప్రతినిధులు కుటుంబసభ్యులను సంప్రదించి అవయవదానానికి ఒప్పించారు.
ఆరోగ్యశ్రీలో ఉచితంగా….
కార్డియో థోరాసిక్ సర్జరీ యూనిట్ చీఫ్ డాక్టర్ అమరేశ్రావు, డాక్టర్ కళాధర్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ గోపాల్, అనెస్తీషియా విభాగాధిపతి డాక్టర్ పద్మజ, వైద్యురాలు డాక్టర్ నర్మదతో కూడిన వైద్యుల బృందం 5 గంటలపాటు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా రోగికి గుండెను అమర్చారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేసినట్టు డాక్టర్ అమరేశ్ తెలిపారు. ప్రస్తుతం హుస్సేన్ కోలుకుంటున్నాడని తెలిపారు.
వీరబాబు కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాం
నా భర్త హుస్సేన్ పెయిటింగ్ పని చేస్తారు. నాకు 4, 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు జబ్బు పడటంతో నానా ఇబ్బందులు పడ్డాం. నిమ్స్ వైద్యులు నా భర్తకు పునర్జన్మనిస్తే.. అవయవదాత వీరబాబు తన జీవితాన్నే అందించారు. మేము జీవించి ఉన్నంతకాలం వారి కుటుంబానికి రుణపడి ఉంటాం.
– టీ రమణ, రోగి భార్య
24 గంటల్లో దొరకడం చరిత్రే
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం మునిగెపల్లికి చెందిన టీ హుస్సేన్ (29) మూడేండ్లుగా డైలేటెడ్ కార్డియో మయోపతి (గుండె వ్యాధి)తో బాధపడుతున్నాడు. ఏడా ది కాలంగా నిమ్స్లో చికిత్స తీసుకుంటున్నా డు. గుండెమార్పిడి మాత్ర మే పరిష్కారమని వైద్యులు సూచించారు. పరిస్థితి విషమించడంతో వారం క్రితం నిమ్స్లో చేరాడు. వైద్యుల సూచనలతో జీవన్దాన్లో మంగళవారం పేరును నమో దు చేసుకున్నాడు. అవయవదాత వీరబాబు యశోద దవాఖానలో బ్రెయిన్డెడ్ అయ్యా డు. జీవన్దాన్ చొరవతో గుండె అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటలలోపు అవయవం లభించడం నిమ్స్ చరిత్రలో ఇదే తొలిసారి. నిమ్స్లో ఇది ఆరో గుండె మార్పిడి శస్త్రచికిత్స. ప్రైవేట్ దవాఖాన నుంచి గ్రీన్ చానెల్ ద్వారా తరలించడం కూడా తొలిసారే.