టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్
వరంగల్, ఆగస్టు 2: తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. సోమవారం వరంగల్ బట్టల బజార్లోని వేంకటేశ్వర ఆలయ కల్యాణ మండపంలో అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ అధ్యక్షతన జరిగిన అర్చక ఉద్యోగ జేఏసీ సర్వసభ్య సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో అర్చక ఉద్యోగులు జేఏసీగా ఏర్పడటం ఆనందంగా ఉన్నదన్నారు. అర్చక ఉద్యోగుల సమస్యలను గంగు ఉపేంద్ర శర్మ అనేక సార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. టీఎన్జీవోస్కు అనుబంధంగా అర్చక ఉద్యోగ జేఏసీ ఏర్పాటైందన్నారు. వీరికి ప్రభుత్వ పే స్కేల్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. అర్చక ఉద్యోగులకు న్యాయం జరిగేలా టీఎన్జీవోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని చెప్పారు. దేవాదాయ శాఖలో పదోన్నతుల్లో అర్చక ఉద్యోగులకు న్యాయం చేయాలని, అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని గంగు ఉపేంద్ర శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 3 వేల మంది అర్చక ఉద్యోగులకు మాత్రమే వేతనం వస్తున్నదని, మిగతా 2,625 మందికి కటాఫ్డేట్ తొలగించి వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు క్యాబినెట్ సమావేశం సిఫారసు చేయడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన తీర్మానాలను సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.