హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కోట ద్వారాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారం.. కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ కళాతోరణం, దుర్గం చెరువు థీమ్తో ఎల్ఈడీ ధగధగలు.. కండ్లకు కట్టేలా వేలాది ఫొటోలతో ఉద్యమ సారథి జీవిత చరిత్ర.. ఏడేండ్ల పాలనలోని అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్.. ఇలా ద్విదశాబ్ది ఉత్సవ వేడుక ‘ప్లీనరీ’ని టీఆర్ఎస్ పార్టీ అంగరంగవైభవంగా నిర్వహించబోతున్నది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా సోమవారం జరిగే ప్లీనరీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులే కాకుండా వారి గన్మెన్లు, పోలీసులు, పాత్రికేయులు ఇలా దాదాపు 15 వేల మంది వస్తారని అంచనా. ఇందుకు తగ్గట్టుగా సదుపాయాలు సమకూర్చుతున్నారు. పార్కింగ్ మొదలు, సభా వేదిక దాకా అన్నింటిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఆకర్షిస్తున్నాయి. పలు కూడళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. జంక్షన్లలో తోరణాలు కడుతున్నారు. మొత్తంగా గ్రేటర్ గులాబీమయమైంది.
ప్రపంచ రికార్డు కోసం..
ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. 20 మీటర్ల వెడల్పు కాన్వాస్పై ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా.. 20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలు గీయనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభించి రికార్డు సమయంలో పూర్తి చేయాలని భావిస్తున్నామని కాకతీయ ఇన్నోవేటివ్ సంస్థకు చెందిన బందూక్ లక్ష్మణ్, రమేశ్ మదాసు తెలిపారు.
ప్లీనరీలో అదిరే ఏర్పాట్లు ఇవీ..
ఊరికో బస్సుతో లక్షలాదిగా తరలిరావాలి
తెలంగాణ విజయగర్జనను విజయవంతం చేయాలి: మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన బహిరంగసభకు లక్షలాదిగా తరలి రావాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో 20 నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, ముథోల్, సిర్పూర్ కాగజ్నగర్, అసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి బస్సు బయలుదేరాలని చెప్పారు. సమావేశాల్లో మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి నివాళి
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్లో ఘన నివాళి అర్పించారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ సహ పలువురు నాయకులు నాయిని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.