నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రంలో చెడుగొట్టు వానలు రైతన్నను కలవరపెడుతున్నాయి. పంట చేతికొస్తున్న వేళ ఈదురుగాలులతో కూడిన వర్షంతో చేతికి వచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం ఏర్పడింది. సోమవారం దాదాపు 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ధాన్యం తడువగా, మామిడికాయలు రాలిపోయాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టగా, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఒక్కసారిగా వర్షం పడింది. అత్యధికంగా జనగామ జిల్లా లింగాలఘన్పూర్లో 4.4 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కారంలో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా రామరెడ్డిలో 3.4, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్లో 3.2, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో 2.4 చొప్పున, హైదరాబాద్ షేక్పేట, ఉప్పల్లో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. శనివారం వరకు రాష్ట్రంలో ఇదే రకమైన వాతావరణం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట, భవానీపేటలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీట మునిగింది. మామిడికాయలు నేల రాలాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఓ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడగా మంటలు చెలరేగాయి. వాజేడు మండలంలో మామిడి కాయలు నేలరాలాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో అరగంటపాటు వర్షం కురిసింది. అశ్వారాపుపేట మండలంలో వడగండ్ల వాన పడింది. కొత్తగూడెం పరిధిలో రుద్రంపూర్లో మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మామిడికాయలు నేలరాలాయి. నాగల్గిద్ద, మనూర్లో వండగండ్లు పడ్డాయి. జొన్న పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా రామాయంపేట, తూప్రాన్ మండలాల పరిధిలో నాలుగు గంటలపాటు విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. చిన్నశంకరంపేట శివారులో ఇటుకబట్టీలో పనిచేస్తున్న మహారాష్ట్ర లాథూర్ జిల్లా జిప్కోడ్ తాలూకా జిర్గా గ్రామానికి చెందిన ఈశ్వర్ (42)పిడుగుపడి మృతిచెందారు. జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది.