మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 4 : జడ్చర్ల మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో మన జిల్లా పోలీసు సిబ్బంది విశేషంగా పనిచేయడం, పలు సందర్భాల్లో సమయ స్ఫూర్తిగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. సమన్వయంగా ఉంటూ ఉమ్మడిగా కృషి చేయడమే విజయాలకు మూలమని సిబ్బందితో అన్నారు. ప్రజలు ఎల్లవేళలా పోలీసులపై అభిమానం, సహకార ధోరణితో ఉంటారన్నారు. పోలీసు చేసే కష్టం గురించి సాధరణ ప్రజలకు పూర్తి అవగాహన ఉండడం వల్లననే వారు మన వెన్నంటి ఉంటారని వివరించారు. జడ్చర్లలో జరిగిన మున్సిపాల్టీ ఎన్నికల సందర్బంగా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, పోలీసుకు సహకరించడం పట్ల ఎస్పీ సంతోషం వ్యక్తపరిచారు. పోలీసు విభాగం యావత్తు శాంతి భద్రతల పరిరక్షణ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని, పోలీసు ప్రజలు కలిసి ఆభివృద్ది వైపు పయనం సాగించాలని ఈ సందర్బంగా ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు.
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి
ప్రతి ఒక్కరూ కొవిడ్పై అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.పోలీసు కు టుంబాలతోపాటుగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా నిర్మూలనలో మనవంతు కృషి చేసిన వారమవుతామని చెప్పారు. మన సమాజాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచే క్రమంలో కలిసికట్టుగా పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు.