హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్ వాణీదేవి
వరంగల్-ఖమ్మం- నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డి
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ
సాధారణ ఎన్నికల్లో ఓటేయడానికి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి చాలా తేడా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా స్వస్తిక్ ఓటు ముద్ర వేయడం కానీ, ఈవీఎంలలో బటన్ నొక్కే విధానం ఉండదు బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేయాలి.
ఓటర్ గుర్తింపుకార్డు లేదా.. ఈసీ నిర్ణయించిన ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్లైసెన్స్. సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, ఎంపీ గుర్తింపుకార్డు, పాన్ కార్డు, విద్యాసంస్థలు జారీచేసిన కార్డు, డిగ్రీ లేదా డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు, దివ్యాంగుల గుర్తింపుకార్డు లలో ఏదైనా ఒకటి తీసుకుపోవాలి
ఓటర్స్లిప్లో సూచించిన నంబర్ గల పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి.
గుర్తింపును నిర్ధారించుకొన్న తర్వాత ఎడమచేతి చూపుడువేలుపై ఇంకు గుర్తు పెట్టి, బ్యాలెట్పేపర్ను చేతికిస్తారు.
దాంతోపాటే ఓటేసేందుకు పెన్ను ఇస్తారు. ఈ పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇతర పెన్నులు వాడితే ఓటు చెల్లదు.
బ్యాలెట్పేపర్పై అభ్యర్థికి ఎదురుగా ప్రాధాన్య క్రమంలో నంబర్లు వేసుకొంటూ వెళ్లాలి. టిక్కులు, క్రాస్లు పెట్టరాదు. ఒక్క నంబర్ వేసినా ఓటు చెల్లుతుంది. మధ్యలో ఎక్కడైనా నోటా వేస్తే ఆ తర్వాత ప్రాధాన్యత చెల్లదు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లుచేసింది. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. రెండు నియోజకవర్గాల్లో 1,530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 7,560 మంది సిబ్బందిని నియమించింది. శనివారం సాయంత్రమే పోలింగ్ సామగ్రితో సహా సిబ్బంది కేంద్రాలకు బయలుదేరివెళ్లారు. రెండు నియోజకవర్గాల్లో భారీసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్ను దినపత్రిక సైజులో ముద్రించారు. జంబో బ్యాలెట్ బాక్సులను రూపొందించారు. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 5,31,268 మంది, వరంగల్-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. పట్టభద్రులు పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేసుకున్నారని.. దీంతో పోలింగ్ శాతం కూడా భారీ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో 50 శాతం కేంద్రాలను వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామనిచెప్పారు. మిగిలిన కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చినట్టు వివరించారు. పట్టభద్రుల ఓ టింగ్కు ప్రాధాన్యతాక్రమం ఉంటుందని, దీంతో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 93 మంది, వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది పోటీ చేస్తున్నారని గోయల్ చెప్పారు. దీంతో పెద్దసైజు బ్యాలెట్ పేపర్ను తయారుచేశామన్నారు. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పెన్నుతోనే ఓటరు.. అభ్యర్థులకు సంబంధించిన గడుల్లో ప్రాధాన్యతా నంబర్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొవి డ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లుచేశామని, మాస్క్ ఉన్న ఓటర్లనే కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద శానిటైజర్ను అందుబాటులో ఉంచడంతోపాటు, ఓట ర్లు భౌతికదూరం పాటించేలా మార్కింగ్చేసినట్టు వివరించారు. కొవిడ్ పేషెంట్లు, 80 ఏండ్ల వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించామనిచెప్పారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆదివారం సెలవు దినం కావడంతో అందరూ ఓటింగ్లో పాల్గొనే అవకాశమున్నదని చెప్పారు. పోలింగ్ ప్రశాంత నిర్వహణకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సీఈవో తెలిపారు.
రెండు నియోజకవర్గాల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు శాంతి భద్రతల అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. 15 వేల మందికిపైగా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్టు చెప్పారు. సున్నితమైన ప్రాం తాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఓటు హక్కు.. మనకు భారత రాజ్యాంగం కల్పించిన పౌరహక్కు అని, ఆదివారం జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కోరింది. శనివారం నాంపల్లి టీజీవోభవన్లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ అధ్యక్షత సమావేశమైన నేతలు మాట్లాడుతూ.. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లోని ఓటర్లంతా విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణంలాంటి ఓటు వేసి బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.