సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి గోదాములు ఎంత అవసరమో.. కల్లాలు అంతే అవసరం. రైతులు తమ దిగుబడులను ఆరబెట్టుకునేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పంటల నూర్పిడి, ఆరబెట్టుకునేందుకు రైతుల భూముల్లోనే సబ్సిడీపై కల్లాల నిర్మాణానికి పూనుకున్నది. ఇందుకోసం నిధులు కూడా మంజూరు చేసింది. తొలి విడుతగా సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 3,500కుపైనే కల్లాల నిర్మాణాలను ప్రారంభించగా ఇప్పటివరకు దాదాపు 25 శాతం పూర్తి కావచ్చాయి. ఇప్పుడిప్పుడే రైతులు ఒకరిని చూసి మరొకరు కల్లాల నిర్మాణానికి ముందుకొస్తున్నారు.
ఐదెకరాల్లోపు వారికి..
ఐదెకరాలు అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఉచితంగా కల్లాల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని మూడు విభాగాలుగా గుర్తించారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కల్లాన్ని రూ.56,187 వ్యయంతో నిర్మిస్తున్నారు. 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కల్లాల నిర్మాణానికి రూ.85,001లు చెల్లిస్తున్నది. ఇందుకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులు అర్హులు. 10 నుంచి 15 శాతం ఉపాధి హామీ పనులు చేయనుండగా మిగిలినవి మెటీరియల్ కంపోనెంట్తో చేపడుతారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా తొలి విడుతగా 3,832 మంది రైతులు తమ భూముల్లో కల్లాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు 2,450 మంది నిర్మించుకునేందుకు స్థలాలు గుర్తించారు. వీటిలో 1,032 కల్లాలు పూర్తి కాగా.. మరో 850 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
కల్లాలతో మేలు..
చేతికి వచ్చిన వరి, కంది, పెసర పంటను ఊరి చివర ఉన్న ఖాళీ ప్రదేశం, స్కూల్ ఆవరణ, బజార్లలో ఎండబెడుతుంట. దీనివల్ల ధాన్యం సరిగ్గా ఎండకపోయేది. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై కల్లాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో మా బావి వద్ద రూ.85 వేలతో కల్లం నిర్మించా. ఇప్పుడు వడ్లను ఆరబెట్టుకుంటున్నా. రైతుల కష్టాలను గుర్తించి సబ్సిడీపై కల్లాలు నిర్మించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పొదిల నారాయణ, పసునూరు, మం: నాగారం
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి సొంత భూము ల్లో కల్లాలను నిర్మిస్తున్నది. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రక్షణాత్మక పద్ధతుల్లో ఆరబెట్టుకోవడం కల్లాలతోనే సాధ్యం. సూర్యాపేట జిల్లాలో తొలుత ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపలేదు. ఇప్పుడిప్పుడే చాలామంది ముందుకు వస్తున్నారు. ఎంతమందికైనా మంజూరు చేస్తాం.
– సుందరి కిరణ్కుమార్, డీఆర్డీవో, సూర్యాపేట