హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 166 జోన్లను పౌరవిమానయానశాఖ గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. నో పర్మిషన్, నో టేక్ఆఫ్ జోన్ల నుంచి వీటిని మినహాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. పౌర విమానయాన శాఖ ప్రకటించిన నూతన గ్రీన్ జోన్లలో తెలంగాణ నుంచి తొమ్మిది, ఏపీ నుంచి నాలుగు జోన్లు ఉన్నాయి. రాష్ట్రంలో నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట్, భావాజీపల్లె, రంగారెడ్డి జిల్లా గుంతపల్లి, మర్కల్, నాగారగుండా,నల్లగొండ, సూర్యాపేటలోని రెండు ప్రదేశాలు, వికారాబాద్ కొత్త జోన్ల జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ జోన్లలో డ్రోన్లు ఎగురవేయాలి అంటే ముందుగా అనుమతులు పొందాల్సి ఉండేది. తాజా ఉత్తర్వులు ప్రకా రం ఇప్పుడు ఆయా ప్రదేశాల్లో డ్రోన్లు ఎగురవేయాలంటే స్థానిక అధికారులకు సమాచారం అందిస్తే సరిపోతుంది. డిజిటల్ స్కె ఫ్లాట్ఫారం ద్వారా డ్రోన్ల వినియోగానికి అనుమతులు పొందే ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. గ్రీన్ జోన్లలో డ్రోన్లు ఎగురవేయాలనుకునే వారు తేదీ, సమయం డిజిటల్ స్కె సైట్ లో ముందుగా నమోదు చేస్తే సరిపోతుంది. అనుమతులున్న ప్రదేశాల్లో 400 అడుగుల వరకు డ్రోన్లు ఎగురవేయడానికి కూడా అవకాశం కల్పించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గ్రీన్ జోన్ల పరిధిలో రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్లు అనుమతి లేకుండా ఎగురవేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఉత్తర్వుల్లో పౌర విమానయాన శాఖ సూచించింది. ఈ కొత్త విధానం ద్వారా దేశంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.