హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బ్లాక్ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) బాధితుల చికిత్సకోసం సెలొన్ ల్యాబొరేటరీస్ నూత న ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగిస్తున్న లింపోసోమల్ ఆంపోటెరిసిన్-బీకి ప్రత్యామ్నాయంగా ఆంపోటెరిసిన్-బీ ఎమల్షన్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ఆంపోటెరిసిన్-బీ ఔషధాన్ని 2013 నుంచే సెలొన్ ల్యాబొరేటరీస్ ఉత్పత్తి చేస్తున్నట్టు సంస్థ ఎండీ నగేశ్కుమార్ తెలిపారు. అయితే ప్రస్తుతం బ్లాక్ఫంగస్ రోగులు పెరుగడంతో ఆంపోటెరిసిన్-బీ మందుకు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. ఈ మందు తయారీకి అవసరమైన ‘లిపోయిడ్లు’ అనే ముడిపదార్థం దిగుమతు లు జర్మనీ నుంచి తగ్గడంతో ఆంపోటెరిసిన్-బీకి కొరత ఏర్పడిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆంపోటెరిసిన్-బీకి ప్రత్యామ్నాయంగా కేవలం 3 వారాల్లోనే ఆంపోటెరిసిన్-బీ ఎమల్షన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రతిరోజూ 10 వేల వయల్స్ను ఉత్పత్తి చేస్తామని, ఇవి ఒక నెలలో సుమారు 6 వేల మందికి సరిపోతాయని పేర్కొన్నారు. ఆంపోటెరిసిన్-బీ ఎమల్షన్ వయల్ ధర రూ.4,000 నుంచి రూ.4,500 వరకు ఉంటుందని, ఈ ఔషధాన్ని నేరుగా కొవిడ్ చికిత్స కేంద్రాలకు సరఫరా చేస్తామని వివరించారు.