హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, సీఎం కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుక నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సీజనల్గా లభించే పూలతో అలంకరించే బతుకమ్మలో వర్షపు నీటిని శుభ్రం చేసే ఔషధగుణాలు ఉంటాయని పేర్కొన్నారు. గౌరీదేవి ఆశీస్సులతో అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ.. ఆనందోత్సాహాల నడుమ ఆటా పాటలతో ఆడబిడ్డలు బతుకమ్మను జరుపుకుంటారని తెలిపారు. సమైక్య పాలనలో విస్మరించిన బతుకమ్మను స్వయంపాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో నిండుగా ఉన్నాయని, బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.