హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటి వరకు 3,676 మంది విద్యార్థులు లబ్ది పొందారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అల్ప సంఖ్యాక వర్గాల పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో తమ ఉన్నత విద్యను అభ్యసించడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఎంత మంది లబ్ది పొందారు అనే ప్రశ్నకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వివేకానంద గౌడ్, షకీల్ అమీర్ మహమ్మద్, హరిప్రియ బానోత్, జాఫర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా ఈ పథకం కింద 3,676 మంది విద్యార్థులు లబ్ది పొందినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పథకం కోసం రూ. 589 కోట్ల 69 లక్షలు ఖర్చు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. విదేశీ విద్య రాష్ర్టంలోని ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగకరంగా మారిందన్నారు. ఈ ప్రోగ్రామ్ గతంలో ఉన్నప్పటికీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. గతంలో ఆదాయ పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. సభ్యులు కోరిన విధంగా ఆదాయ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే అంశంపై సీఎం కేసీఆర్తో చర్చిస్తామని పేర్కొన్నారు. విమానయాన ఖర్చుల కోసం రూ. 60 వేలు అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలోకి అమెరికా, ఇంగ్లండ్, ఆస్ర్టేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, దక్షిణకొరియా, న్యూజిలాండ్, జపాన్ దేశాలను పొందుపరచడం జరిగిందన్నారు. వీటితో పాటు మరికొన్ని దేశాలను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.