హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. మంగళవారం పథకం కింద 2.09లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.651.07 సాయం జమకానుంది. ఇప్పటి వరకు మొత్తం 59.70లక్షల మంది రైతులకు అందగా.. ఆయా రైతుల ఖాతాల్లో రూ.6,663.79 కోట్లు జమైంది. వానాకాలం సీజన్లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది మొత్తం కోటిన్నర ఎకరాలకు రైతుబంధు లభించనుంది. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులకు రైతుబంధు వర్తిస్తుండగా.. 66,311 ఎకరాల భూమి అదనంగా సాగవుతుంది. ఈ నెల 15న నుంచి రైతులకు పంట సాయం అందుతుండగా.. ఈ నెల 25వ తేదీ వరకు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రూ.5వేల చొప్పన సాయం అందనుంది.