ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరం బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఇవాళ ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖేశ్ అంబానీ సెక్యూర్టీ విచారణ అంశాన్ని తప్పుదోవ పట్టిచేందుకు హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేసినట్లు పవార్ అన్నారు. అంబానీ బాంబు బెదిరింపు కేసుతో సంబంధం ఉన్న మన్సూక్ హిరేన్ ను ఎవరు హత్య చేశారో కూడా విచారణలో తేలుతుందని ఆయన తెలిపారు. ముంబై ఏటీఎస్ ఈ కేసును సరైన రీతిలోనే విచారిస్తోందని, దాన్ని పక్కదోవ పట్టించేందుకు, పరం బీర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని శరద్ పవార్ తెలిపారు. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసేది లేదని పవార్ స్పష్టం చేశారు.
ఇన్స్పెక్టర్ సచిన్ వాజేను మంత్రి దేశ్ముఖ్ కలవలేదని, ఎందుకంటే ఆ సమయంలో ఆయన కరోనా చికిత్స పొందారని శరద్ పవార్ తెలిపారు. పబ్బులు, రెస్టారెంట్ల నుంచి నెలకు వంద కోట్లు వసూల్ చేయాలని దేశ్ముఖ్ పోలీసులకు ఆదేశించినట్లు పరం బీర్ తన లేఖలో ఆరోపించారు. అయితే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మంత్రి దేశ్ముఖ్ హాస్పిటల్లో ఉన్నారని, నాగపూర్లోని తన ఇంట్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు. అందుకే ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పవార్ తెలిపారు. అంబానీ బాంబు బెదిరింపు కేసు విచారణ సరిగా సాగడం లేదని మాజీ పోలీసు కమీషనర్ పరం బీర్ సింగ్ను హోమ్గార్డ్స్ డీజీగా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ పోలీసు కమీషనర్.. మంత్రి దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు చేశారు. సీఎం ఉద్దవ్కు పరం బీర్ లేఖ రాశారు. హోంమంత్రి వసూళ్ల రాకెట్ మొదలుపెట్టిన ఆ లేఖలో పోలీసు ఆఫీసర్ ఆరోపించారు. సచిన్ వాజే కూడా ఆ జాబితాలో ఉన్నట్లు ఆయన తెలిపారు.