వెల్గటూర్: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి శివారులో రాష్ట్ర రహదారిని ఆనుకొని ఉన్న ఎకరం స్థలంలో రూ.4.60 కోట్లతో చేపట్టనున్న హరిత హోటల్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోటిలింగాల, ధర్మపురి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు.
ధర్మపురిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు ఇప్పటికే కేటాయించగా పనులు శర వేగంగా నడుస్తున్నాయన్నారు. కోటిలింగాలను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ఇప్పటికే రూ. 2 కోట్ల నిధులతో బోటింగ్ ప్రారంభించామని, కోటిలింగాల, ధర్మపురికి వచ్చే పర్యాటకుల సౌకర్యం కోసం రూ.4.60 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ద ఉందని గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ కాళేశ్వరం నుంచి ధర్మపురి వరకు బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ధర్మపురి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడంలో మంత్రి కొప్పుల కృషి గొప్పదని కొనియాడారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మందికి రూ. 2,24,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాల హాస్టల్ భవనంలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐసొలేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, ఆర్డీవో మాధురి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.