సిద్దిపేట కలెక్టరేట్, మే 7 : కరోనా మహమ్మారి నియంత్రించేందుకు ప్రజాప్రతినిధులంతా బాధ్యతగా పనిచేయాలి, విపత్కర సమయంలో ప్రజలకు సేవ చేస్తే తగిన గౌరవం, పుణ్యం వస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డితో కలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో కొవిడ్ బాధితులకు అవసరమైన చికిత్స అందించడంలో ప్రజాప్రతినిధులంతా ముందుండాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా సమష్టిగా పనిచేసి కరోనాను అరికట్టడంలో సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా నిలుపాలన్నారు. కొవిడ్ బాధితులకు అవసరమైన చికిత్స అందేలా చూడడంతో పాటు, వారిలో మనోధైర్యాన్ని నింపాలన్నారు.
స్థానికంగా సర్పంచ్, కార్యదర్శి, ఏఎన్ఎం, అశకార్యకర్తలు, వీవోఏలు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 666 బృందాల ద్వారా ఇంటింటా జ్వరం సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సర్వే బృందాల పనితీరును తాను జిల్లా యంత్రాంగం మానిటరింగ్ చేస్తుందన్నారు. సర్వేలో వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వం అందించే మందుల కిట్ను వెంటనే అందించాలన్నారు. వచ్చే మూడు వారాల ధాన్యం కొనుగోలు మినహా మిగతా పనులు అధికారులు బంద్ ఉంటాన్నారు. అందరూ సామూహిక కార్యక్రమాలను దూరంగా ఉండాలన్నారు. అక్సిజన్ లెవెల్ 94 శాతం కంటే తక్కువ ఉండే 108 ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐసొలేషన్ కేంద్రాలను తీసుకురావాలన్నారు.
మాస్క్ ధరించని వ్యక్తులకు రూ.500 జరిమానా వేయాలన్నారు. కొవిడ్ విపత్తు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రజాప్రతినిధులు చూడాలన్నారు. కొవిడ్ చికిత్స అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. జిల్లా కేంద్రంలో కొవిడ్ కేర్ సెంటర్ల ద్వారా బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. సమావేశంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా వైద్యాధికారి మనోహర్ పాల్గొన్నారు.