మంచిర్యాల, మే 22(నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా చాలామంది పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలు, దినసరి కూలీలకు విప్ బాల్క సుమన్ అండగా నిలుస్తున్నారు. ‘నేనున్నాను.. అధైర్యపడకండి’ అంటూ భరోసా ఇస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలోనూ మనోధైర్యం నింపుతున్నారు. ప్రధానంగా తన నియోజకవర్గంలోని ప్రజలు ఆకలితో అలమటించకూడదని భావించి.. నాయకులు, కార్యకర్తల సహకారంతో బాధితులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేయిస్తున్నారు. తాను కూడా సొంత ఖర్చుతో అందజేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం కల్పించారు. లాక్డౌన్ కారణంగా నియోజకవర్గంలో పనిలేక ఇబ్బందులు పడుతున్న రెండువేల మంది నిరుపేదలకు సొంత ఖర్చుతో ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున 13 రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి కిలో కందిపప్పు, కిలో పెసరపప్పు, కిలో చక్కెర, అరకిలో చింతపండు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, రెండు మంచి నూనె ప్యాకెట్లు, టీ పౌడర్, సబ్బులు అందజేస్తున్నారు.
కరోనా బాధితులకు డ్రైఫూట్స్, పండ్లు..
కరోనా బాధితులు త్వరగా కోలుకునేలా వారిలో రోగనిరోధక శక్తి పెంచేందుకు సొంత ఖర్చుతో ఇటీవల డ్రైఫూట్స్, పండ్లు పంపిణీ చేయించారు. నియోజకవర్గంలోని 1,896 మంది కొవిడ్ బాధితులకు ఒక్కొక్కరికి రూ. 800 విలువ చేసే బాదం, ఖర్జూర, కిస్మిస్, కాజుతో కూడిన డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లను, యాపి ల్, సంత్రాలు వంటి పండ్లను అందజేశారు.