హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగాభివృద్ధికి తెలంగాణ సర్కారు తోడ్పాటు అందించడంతోపాటు పెద్దపీట వేస్తున్నదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ విద్యాహబ్గా ఎదుగుతున్నదని అన్నారు. ఇక్కడున్న ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్ వంటి ఉన్నత విద్యాకాలేజీల్లో ప్రవేశాలు పొందడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. టీ న్యూస్, అపెక్స్ సంయుక్తంగా హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో గురువారం ఏర్పాటుచేసిన గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2021ను ఆయన ప్రారంభించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ ఫెయిర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఐటీరంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అఫిలియేషన్ పొందిన దాదాపు 100 ఇంజినీరింగ్ కాలేజీలు ఎడ్యుకేషన్ ఫెయిర్లో తమ స్టాళ్లను ఏర్పాటుచేసి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు.
టీన్యూస్ ఆధ్వర్యంలో ఎనిమిదో గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడంపై నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీ న్యూస్ ఎడిటర్ సురేశ్బాబు, మర్రి లక్ష్మణ్రెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజీ ప్రిన్సిపాళ్లు కేవీరెడ్డి, శ్రీనివాసరావు, శ్రేయాస్ ఇంజినీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ హృదయ్రెడ్డి, టీ న్యూస్ సీజీఎం ఉపేందర్, శ్రీదత్త విద్యాసంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి, అపెక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎండీ దినేశ్కుమార్ గట్టు, టీ న్యూస్ డీజీఎం కిరణ్, మార్కెటింగ్ టీం సత్యపాల్ శ్రీనివాస్, భాస్కర్, వెంకట్రెడ్డి, సతీశ్, పెద్దసంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2021కు ప్లాటినం స్పాన్సర్గా మర్రి లక్ష్మణ్రెడ్డి విద్యాసంస్థలు, డైమండ్ స్పాన్సర్గా సీఎంఆర్ విద్యాసంస్థలు, గోల్డ్ స్పాన్సర్గా మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవహరించాయి.