నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఫలితాలకు రెండు రోజులు పట్టే అవకాశం
ఉదయం 8 గంటలకు ప్రక్రియ షురూ
రాత్రి వరకు కొనసాగనున్న బండిల్స్ కట్టడం..
ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు..
56 టేబుళ్లు ఏర్పాటు.. ఒక్కో రౌండ్కు 56 వేలు లెక్కింపు
మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలనట్లయితే…
రెండో ప్రాధాన్యత ఓట్లతో ఎలిమినేషన్ రౌండ్..
సరూర్నగర్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఫలితాలు
పెరిగిన ఓటింగ్పై అభ్యర్థుల ఆశలు
అందరి దృష్టి కౌంటింగ్పైనే..
రంగారెడ్డి/వికారాబాద్, మార్చి 16, (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్తో ప్రశాంతంగా ముగియగా, బుధవారం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో చేపట్టనున్న ఈ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒక గదికి ఏడు టేబుళ్ల చొప్పున 8 గదుల్లో మొత్తం 56 టేబుళ్లను ఏర్పాటు చేశారు. టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున ఒక్క రౌండ్లో 56వేల ఓట్లను లెక్కించనున్నారు. ప్రాధాన్యతాక్రమంలో ఓట్లు వేసిన విధంగానే లెక్కింపు కూడా ఉంటుంది. మొత్తం చెల్లిన ఓట్లలో యాభైశాతానికంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా మొదటి ప్రాధాన్యత లెక్కింపుతోనే కౌంటింగ్ పూర్తవుతుంది. ఈ పద్ధతిలో ఫలితం తేలకపోతే ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి విజేతను నిర్ణయిస్తారు. ఈ విధానంలో విజేత ఎవరో తేలడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలనుంచి ఓట్లను కట్టలు కట్టడం ప్రారంభిస్తారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్గా కట్టనుండగా.. ఈ ప్రక్రియ దాదాపు 12 గంటలు కొనసాగనున్నది. ఆ తరువాతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీని ప్రకారం బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఫలితాల వెల్లడి పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపునకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 6:30 గంటల వరకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూంలను తెరువనున్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచే ముందు ఏజెంట్లతో పరిశీలన చేసిన అనంతరం వారి సంతకం తీసుకొని బ్యాలెట్ బాక్సులను తెరవనున్నారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం మొత్తం 5,31,268 ఓట్లుండగా, 3,57,354 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లు అధికంగా ఉన్న దృష్ట్యా ఫలితాల కోసం రెండు రోజులపాటు వేచిచూడక తప్పదు. లెక్కింపు ప్రక్రియ నిర్విరామంగా కొనసాగనున్నది కాబట్టి షిఫ్ట్ల వారీగా పని చేసేందుకుగాను అధికారులు, సిబ్బందిని నియమించారు.
ఓట్ల లెక్కింపు ఇలా..
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకుగాను 8 హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా కాకుండా 799 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్ బ్యాలెట్ పత్రాలను ఉంచిన అనంతరం మొదట 25 బ్యాలెట్ పత్రాల చొప్పున బండిల్ కట్టనున్నారు. ఇలా బండిల్ కట్టిన బ్యాలెట్ పత్రాలను డ్రమ్ముల్లో వేయనున్నారు. కేవలం బండిల్ కట్టేందుకు 12 గంటలకుపైగా సమయం పట్టే అవకాశమున్నది. రాత్రి 8 గంటల వరకు బండిల్ కట్టే ప్రక్రియనే కొనసాగనున్నది. అనంతరం బండిల్ కట్టిన బ్యాలెట్ పత్రాలను తీసి చెల్లని, చెల్లుబాటయ్యే ఓట్లను వేరు చేయనున్నారు. ఈ ప్రక్రియను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో చేయనున్నారు. చెల్లని, చెల్లుబాటయ్యే ఓట్లను వేరు చేసిన అనంతరం మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లు ఎన్ని ఉన్నాయనేది లెక్క తీసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది.
రాత్రి 10 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కించనున్నారు. ఏకకాలంలో 56 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున ఒక్కో రౌండుకు 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. 3,57,354 ఓట్లు పోలైన నేపథ్యంలో సంబంధిత ఓట్లను లెక్కించేందుకు దాదాపు 12 గంటల సమయం పట్టే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన అనంతరం ఏ అభ్యర్థికి అయితే 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయో సంబంధిత అభ్యర్థి గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికి కూడా పోలైన ఓట్లలో 50 శాతానికిపైగా ఓట్లు రాలేనట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్ రౌండ్ను కూడా ప్రారంభిస్తారు. 93వ అభ్యర్థికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికి వేశారనేది పరిగణనలోకి తీసుకొని వారికి సంబంధిత ఓట్లను కలుపనున్నారు. ఈ విధంగా చివరి నుంచి ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ప్రధాన అభ్యర్థులకు కలుపనున్నారు. ఈ విధంగా కలిపిన ఓట్లతో ఎవరికి అయితే 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయో సంబంధిత అభ్యర్థి విజయం సాధించనున్నారు.
అభ్యర్థుల భవితవ్యం బుధ లేదా గురువారం తేలనుండడంతో ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ నెలకొన్నది. వికారాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25,958 మంది ఓటర్లు ఉండగా, 20,910 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 80.55 శాతం పోలింగ్ నమోదైంది. 93 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓటుపై ప్రస్తుతం చర్చ సాగుతున్నది.