హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహాలు రచిస్తున్నది. ఇందులో భాగంగా సూపర్ స్ప్రెడర్స్పై ప్రధానంగా దృష్టిపెట్టనున్నది. వాళ్లు కొవిడ్ బారిన పడితే ఒక్కరి ద్వారా పదుల సంఖ్యలో వైరస్ వ్యాప్తి చెందుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా వీరికి టీకాలు వేయాలని ప్రణాళిక రచిస్తున్నది. వీధి వ్యాపారులు, ఆటోడ్రైవర్లు, ఆన్లైన్ఫుడ్, గ్రోసరీ డెలివరీ బాయ్స్, రేషన్ డీలర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వంటివారు నిత్యం ప్రజల్లో ఉంటారు. వీళ్లకు కరోనా సోకితే లక్షణాలు బయటపడి, నిర్ధారణ అయ్యేసరికి 3-4 రోజులు పడుతున్నది. ఆలోగా వారు సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. మొదటివేవ్ సమయంలో సూర్యాపేటలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత గణాంకాల ప్రకారం కొవిడ్ బాధితుల్లో 50 ఏండ్లలోపువాళ్లు 74% ఉన్నారు. వీరంతా ఉద్యోగం, ఉపాధి నిమిత్తం బయటికి వెళ్లేవారే. వారిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30-40% మందికి సూపర్ స్ప్రెడర్స్ వల్లే వైరస్ సోకిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే ఆర్టీసీ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన ముఖ్య అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం టీకాలు వేయించింది. వీరితోపాటు ఇతర వర్గాల వారికి టీకాలు వేసేందుకు లెక్కలు తీస్తున్నది. రేషన్ డీలర్లు, ఆటో డ్రైవర్లు, వ్యాపార సంఘాలు, ట్రేడర్స్ యూనియన్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డది. వీధి వ్యాపారుల వివరాలను స్థానిక ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల తో సేకరించే అవకాశం ఉన్నది.