కడ్తాల్, ఏప్రిల్2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సకల వసతులు సమకూరాయి. పల్లె ప్రగతితో కడ్తాల్ గ్రామ స్వరూపమే మారిపోయింది. పల్లెప్రకృతి వనం, రైతువేదిక, డంపింగ్యార్డు, వైకుంఠధామం ఇలా గ్రామంలో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించారు. పంచాయతీకి చెందిన రెండు ట్రాక్టర్లతో ప్రతి రోజు పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నారు. దీంతో చెత్తా చెదారం, మురుగు ఆనవాళ్లు లేకుండా స్వచ్ఛ కడ్తాల్గా మారింది. గ్రామంలోని పాడుబడ్డ ఇండ్లను కూల్చేశారు. పాతబావులు పూడ్చేశారు.
పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు
గతంలో సమస్యలతో సతమతమైన కడ్తాల్, పల్లెప్రగతి కార్యక్రమంతో ఎంతో అభివృద్ధి చెందింది. రూ.22 లక్షలతో సకల హంగులతో రైతువేదిక నిర్మించారు. వేదిక చుట్టూ మొక్కలు నాటారు. ఒకటిన్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో నాలుగు వేల మొక్కలు నాటారు. వీటిలో జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, బాదం, ఉసిరితోపాటు వివిధ రకాల పూల మొక్కలు నాటారు. రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించారు. పంచాయతీ ట్రాక్టర్లతో ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామంలో స్నానాల గదులు, తదితర అభివృద్ధి పనులు చేశారు. పంచాయతీలోని 14 వార్డుల్లో రూ.లక్షల వ్యయంతో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. రోడ్డుకిరువైపులా హరితహారం మొక్కలు నాటారు.
నిధులను సద్వినియోగించుకున్నాం
ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకున్నాం. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. అహర్నిశలు శ్రమించి పల్లెప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం. గ్రామంలో వైకుంఠధామం, రైతువేదిక, డంపింగ్యార్డు పూర్తయ్యాయి. వందశాతం మరుగుదొడ్లు నిర్మించాం. పాలకమండలి, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులు పూర్తిచేశాం.
– లక్ష్మీనర్సింహారెడ్డి, కడ్తాల్ సర్పంచ్
అన్ని వసతులు సమకూరాయి
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ప్రభుత్వ నిధులతో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం, డంపింగ్యార్డు, సీసీ రోడ్లు ఏర్పాటు చేశాం. అన్ని వసతులు కల్పించడంతో గ్రామాల్లో కొత్తదనం కనిపిస్తున్నది. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రజలు అవగాహన కల్పిస్తున్నాం
– రామకృష్ణ, ఎంపీడీవో, కడ్తాల్
ఇవీ కూడా చదవండి
కృష్ణబిలాలపై అంతర్జాతీయ పరిశోధనలో ఐఐటీ హైదరాబాద్
త్వరలో Mi స్మార్ట్ బ్యాండ్ 6 లాంచ్!