సాధారణ వార్డు+ ఐసొలేషన్ 4000
వెంటిలేటర్ లేకుండా ఐసీయూ+ఐసొలేషన్ 7500
వెంటిలేటర్తో ఐసీయూ+ ఐసొలేషన్ 9000
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర సేవల పేరిట ప్రైవేటు దవాఖానలు చేస్తున్న దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్టవేసింది. కొవిడ్ చికిత్సలో భాగంగా అందించే ఆయా సేవలకు గరిష్ఠ చార్జీలను నిర్ణయిస్తూ బుధవారం జీవో నం.40ని జారీచేసింది. పడకల చార్జీలపై గతంలో జారీచేసిన నిబంధనల్లో మార్పులు చేసి, నిర్ధారణ పరీక్షలు, అంబులెన్స్ సేవలను కొత్తగా కలిపింది. ప్రైవేటు దవాఖానలు ఇకపై ప్రభుత్వం ఖరారుచేసిన చార్జీలనే వసూలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, తెలంగాణ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత ప్రజారోగ్య సంచాలకుడు చార్జీల విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం గరిష్ఠ చార్జీలను నిర్ణయిస్తూ తాజా ఆదేశాలు జారీచేసింది. ఏ ప్యాకేజీలో పేషెంట్ చేరినప్పటికీ బెడ్ చార్జీల్లో భాగంగానే అన్ని నిర్ధారణ పరీక్షల ధరలు కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. ఇక గరిష్ఠ ధరలు ఇన్సూరెన్స్ పథకం, ఇతర ఆరోగ్య ఒప్పందాల పరిధిలో లబ్ధి పొందే పేషెంట్లకు వర్తించవని స్పష్టం చేసింది. దవాఖానలు ఇష్టారీతిగా మందుల వాడకాన్ని ప్రోత్సహించవద్దని, అనవసర నిర్ధారణ పరీక్షలు సూచించవద్దని, హెచ్ఆర్సీటీ లేదా ఇతర దుష్ప్రభావాలు చూపే పరీక్షల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేసింది. ఈ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన దవాఖానలపై కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ హెచ్చరించారు.