జోగులాంబ గద్వాల : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా దవాఖానలో హోప్ పౌండేషన్ వారు అందజేసిన అంబులెన్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో రోగులను ఇతర వైద్యశాలకు తరలించడానికి ఈ అంబులెన్సు ఉపయోగపడుతుందన్నారు.
అలాగే దవాఖాన ఆవరణలో 250 పడకలకు అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్ రెడ్డీస్ ల్యాబ్ వారు అందజేయగా ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మరో వంద పడకల కు అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో దవాఖానాలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలో త్వరలో 3 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చందు నాయక్, పురపాలక చైర్మన్ కేశవ్, ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.