హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 15 (నమస్తే తెలంగాణ): హాట్కేక్లా ఉన్న కాప్రా కస్టోడియన్ భూములపై మళ్లీ రియల్టర్లు కన్నుపడింది. తాజాగా 13.17 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించింది. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, లేఔట్ ద్వారా వాటిని అమాయకులకు అంటగట్టేందుకు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. తాసిల్దార్ గౌతమ్కుమార్ ఫిర్యాదు మేరకు నిందితులు మొలుగు శరత్చంద్రారెడ్డి, మేకల శ్రీనివాస్యాదవ్, జే నాగరాజుగౌడ్, మండల వినయ్కుమార్గౌడ్, మండల రాజుగౌడ్, మండల నందంపై జవహర్నగర్ పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాప్రా గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 9, 11, 47, 140-143, 151-153, 676, 677ల్లోని 90.08 ఎకరాల భూములు ఎవాక్యూ ఆస్తులేనని 2011లో సుప్రీంకోర్టు తేల్చింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ భూములను కబ్జాల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రెవెన్యూ, మండల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులోని 20.27 ఎకరాల భూమిని కోర్టు ఆదేశాల మేరకు బాలకృష్ణ అనే వ్యక్తికి మ్యుటేషన్ చేశారు. మిగిలిన 69.21 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నది. ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు తరచూ కబ్జా చేసేందుకు యత్నించడం… రెవెన్యూ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. ఈ ఏడాది మార్చి 16న శరత్చంద్రారెడ్డి, శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కబ్జాకు యత్నించగా… రెవెన్యూ యంత్రాంగం అడ్డుకుంది. అప్పట్లో నిందితులపై జవహర్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
తప్పుడు డాక్యుమెంట్లతో భూములు కాజేసే యత్నం
తరచూ కస్టోడియన్ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లతో ఆ భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా అది ప్రభుత్వ ఆధీనంలో భూమి కాగా… ప్రైవేటు వ్యక్తులు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్లు చేసుకోవడం ఇక్కడ కీలకం. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి… ఇది తమ భూమి అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయస్థానాల్లో కౌంటర్ దాఖలు చేయడంతో న్యాయస్థానాలు ఆ కేసును కొట్టేసిన సందర్భాలున్నాయి. ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని… ఈ ఏడాది కూడా సదరు వ్యక్తులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భూములకు తామే పట్టాదారులమని, హెచ్ఎండీఏ లేఔట్ అనుమతులు ఇచ్చిందని కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. తొలుత వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు… తిరిగి సదరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో, వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించారని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ భూముల్లో కబ్జాకోరులు ఫెన్సింగ్ ఏర్పాటుచేయడానికి ప్రయత్నించడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.