న్యూఢిల్లీ: ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని హర్యానా ప్రభుత్వం చేసిన చట్టంపై ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ మండి పడింది. హర్యానా ప్రగతికి, ప్రత్యేకించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి విపత్తు (డిజాస్టర్)గా మారనున్నదని ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలోని ఉత్తమ ప్రతిభావంతులను పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. హర్యానాయేతర రాష్ట్రాల నుంచి నిపుణులను తెచ్చుకోకుండా ప్రగతి నిరోధక చట్టం కానున్నది. తుదకు ఈ చట్టం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది’ అని పేర్కొన్నారు.
హర్యానా సర్కార్ నిర్ణయం రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఉదయ్ శంకర్ స్పష్టం చేశారు. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేసేందుకు దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తికి వ్యతిరేకంగా హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నియామకాల పర్యవేక్షణ, తనిఖీలకు అధికారులను నియమించడం సంబంధిత సంస్థల యాజమాన్యాలను వేధింజడానికి దారి తీస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
జే సాగర్ అసోసియేట్స్ అనే న్యాయ సంస్థ పార్టనర్ అనుపమ్ వర్మ మాట్లాడుతూ.. హర్యానా సర్కార్ చట్టం.. రాజ్యాంగంలోని 19 (1) (జీ), 16 (2) అధికరణాల ప్రకారం న్యాయస్థానాల ముందు నిలువదని వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని అమలు చేసే విషయమై పునరాలోచించాలని హర్యానా సర్కార్ను బుధవారం మరో ఇండస్ట్రీ బాడీ సీఐఐ కోరింది. కాగా, ఈ చట్టానికి హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆమోద ముద్ర వేశారు.