ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు బతిమిలాడించుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఊదమంటే ఊదకుండా సతాయిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ను దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత కొందరు పైకి.. మరికొందరు కిందికి.. ఇంకొందరు ఉఫ్ ఉఫ్ అంటూ గాల్లోకి ఊదుతున్నారు. దీంతో సరైన రీడింగ్ రాకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. 15 సెకన్లు క్రమంగా ఊదితేనే మెషీన్ రీడింగ్ తీసుకుంటుంది. లేదంటే పదే పదే బీఏసీ కౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక డ్రంక్ అండ్ డ్రైవర్కు బీఏసీ చేయాలంటే కనీసం 20 నిమిషాలు సమయం తీసుకుంటుండగా తనిఖీలు అర్ధరాత్రి వరకు సాగుతున్నాయి.
డ్రంక్ అండ్ డ్రైవర్లు నానా హంగామా సృష్టిస్తున్నారు. కొందరు పోలీసులను బండ బూతులు తిడుతుండగా.. మరికొందరు దాడులకు దిగుతూ బీఏసీ కౌంట్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇంకొందరు మందుబాబులు వాహనాన్ని అడ్డుపెట్టి తనను పోలీసులు వేధిస్తున్నారని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలంటే ట్రాఫిక్ పోలీసులు భయపడుతున్నారు. ఇటీవల కేపీహెచ్బీ కాలనీ వద్ద నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో కారు డ్రైవర్ సహకరించక పోలీసులపై గొడవకు దిగాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనాస్థలానికి వచ్చిన ఏఎస్సై మహిపాల్రెడ్డిని మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పోలీసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గత మూడేండ్లలో సైబరాబాద్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహణ సమయంలో మందుబాబులు పోలీస్ అధికారులు, సిబ్బందిపై 36 సార్లు దాడులు చేశారు. ఇక మీదట నుంచి డ్రంకన్ డ్రైవ్ సమయంలో పోలీసులకు సహకరించకున్నా.. దాడులు చేసిన కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
డ్రంకన్ డ్రైవ్ సమయంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం. మందుబాబులు అరేయ్.. తురేయ్ అంటూ తిడుతున్నారు. నిజాయితీగా తనిఖీలు చేస్తుంటే కక్షగట్టి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు తప్పుడు సమాచారం ఇస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ కౌంట్ తీస్తుంటే నానా హంగామా సృష్టిస్తున్నారు. అయినా ఒపికతోనే ఉంటూ డ్రంకన్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాం. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా డ్రంకన్ డ్రైవ్లు చేపడుతున్నాం. -రామకృష్ణ, ఇన్స్పెక్టర్, శంషాబాద్ ట్రాఫిక్ ఆర్జీఐఏ పీఎస్