హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలం సీజన్ వ్యవసాయ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చడంలో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా, వ్యవసాయ పనులపై ప్రభావం లేకుండా చేసేందుకు పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు రోజంతా తెరిచే ఉండనున్నాయి.