గోదావరి ఎదురెక్కి రెండేళ్లు
వంద టీఎంసీలకు పైగా ఎత్తిపోతలు
బరాజ్లు, డ్యాంలకు జలకళ
నట్టెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు
గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
రూ.వేల కోట్లలో పంట దిగుబడులు, మత్స్య సిరులు
కరీంనగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):2019 జూన్ 21 సాగునీటి చరిత్రలో అపూర్వ ఘట్టం.. తెలంగాణ రైతాంగానికి శుభదినం.. కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితమైన రోజు.. పనులు ప్రారంభించిన మూడేళ్లలోనే బృహత్తర లక్ష్యం నెరవేరిన ఘడియ. గోదావరి ఎదురెక్కి నేటికి సరిగ్గా రెండేళ్లు.. తొలిఫలం అందుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అద్భుత ఫలితాలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. వంద టీఎంసీలకు పైగా ఎగువకు పరవళ్లు తొక్కడంతో బరాజ్లు, డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. నట్టెండకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకాయి. ఒకప్పుడు చుక్క నీరు లేక బీళ్లుగా మారిన భూములు పచ్చని పంటలతో సస్యశ్యామలమయ్యాయి. మూలమూలకూ చేరిన గోదావరి జలాలు వేల కోట్ల పంట దిగుబడులే కాకుండా మత్స్య సిరులు కురిపించాయి.
ప్రపంచ ఇరిగేషన్ ఇంజినీరింగ్ చరిత్రలోనే ఎవరి ఊహకు అందని విధంగా రీ ఇంజినీరింగ్ విధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌధం చారిత్రాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసి నేటికి రెండేళ్లు. 2019 జూన్ 21న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు జగన్, దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. కాళేశ్వరం దిగువన గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత జలాలను ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములకు మళ్లించడమే లక్ష్యంగా గోదావరికి ఎగువకు నడక నేర్పించారు. సముద్రమట్టం నుంచి +618 మీటర్ల ఎత్తువరకు నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం + 525 మీటర్ల ఎత్తు దాకా నీటిని తరలిస్తున్నారు. రెండేండ్ల నుంచి కాళేశ్వరం లింక్-1,2 ద్వారా నీటిని నిరంతరంగా ఎత్తిపోస్తున్నారు.
ఈ రోజు వరకు ప్రాజెక్టు నుంచి 108 టీఎంసీల నీటిని పంపింగ్ చేశారు. లింక్-1లో భాగంగా ప్రాణహిత నుంచి వస్తున్న నీటిని ఒడిసిపట్టేందుకు సముద్ర మట్టానికి +93 మీటర్ల ఎత్తులో 16. 17 టీఎంసీల సామర్థ్యంతో లక్ష్మీ బరాజ్ను నిర్మించారు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద, పొడవైన లక్ష్మీ పంప్హౌస్కు రూపకల్పన చేశారు. నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా 17 పంపులను బిగించి నడుపుతున్నారు. లక్ష్మీ పంప్హౌస్కు ఎగువన సముద్రమట్టానికి 117. 70 మీటర్ల ఎత్తులో 10. 87 టీఎంసీల సామర్థ్యంతో సరస్వతీ బరాజ్ను 66 గేట్లతో నిర్మించారు. ఇక్కడ ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు వీలుగా 12 మోటర్లతో సరస్వతీ పంప్హౌస్కు రూపకల్పన చేశారు. వీటితో ఫోర్బే ద్వారా వచ్చిన నీటిని ఎత్తిపోసేందుకు సముద్రమట్టానికి + 127. 48 మీటర్ల ఎత్తులో 8. 83 టీఎంసీల కెపాసిటీతో 74 గేట్లతో పార్వతీ బరాజ్ను నిర్మించారు. నేటి వరకు ఇక్కడి నుంచి 104.20 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. పార్వతీ బరాజ్కు అనుబంధంగా నిత్యం 3టీఎంసీల నీరును తరలించేందుకు 14 పంపులతో పార్వతీ పంప్హౌస్ను నిర్మించారు. ఇక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి నేటి వరకు 105.75 టీఎంసీల నీటిని పంపింగ్ చేశారు.
లింక్-2లో..
లింక్-2లో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం శివారులో భూగర్భంలో భారీ పంప్హౌస్ను నిర్మించారు. ఇక్కడ 0.5 టీఎంసీల సామర్థ్యంతో సర్జ్ఫూల్ను ఏర్పాటు చేశారు. అయితే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పాలకుర్తి మండలం వేంనూర్లో పంప్హౌస్ నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నుంచి, 9.534 కిలోమీటర్ల మేర జంట సొరంగాల ద్వారా టన్నెల్లోకి వచ్చేలా నిర్మాణాలు పూర్తి చేశారు. అలాగే సర్జ్పూల్లోకి వచ్చే ఎల్లంపల్లి నీటిని మేడారం రిజర్వాయర్లోకి ఎత్తిపోసేందుకు పంప్హౌస్లో 127.6 మెగావాట్ల సామర్థ్యమున్న ఏడు మోటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మోటార్ 105 మీటర్లపైనున్న ఉపరితలంపైన నీటిని ఎత్తిపోస్తుంది. ఏడు మోటర్లు ఏకకాలంలో రోజంతా (24గంటలు) నడిస్తే రెండు టీఎంసీల నీరు లిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రోజు వరకు 111.62టీఎంసీల నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ బరాజ్లోకి తరలించారు. ఇక్కడి నుంచి నీటిని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలించేందుకు ప్రపంచంలోనే ఎక్కడాలేనివిధంగా 139 మోగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు బాహుబలి మోటర్లతో అతిపెద్ద అండర్గ్రౌండ్ గాయత్రీ పంప్హౌస్కు రూపకల్పన చేశారు. వీటి ద్వారా ప్రతిరోజూ 3150 క్యూసెక్కుల నీటిని ఎస్సారార్కు పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ రోజు వరకు 108.85 టీఎంసీల నీటిని శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి ఎత్తిపోశారు. ఇక్కడి నుంచి గోదావరి జలాలు లోయర్ మానేర్ డ్యాం(ఎల్ఎండీ)కు, అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక్సాగర్, కొండపోచమ్మ వరకు పరవళ్లు తొక్కుతూ ప్రాణహిత గోదావరి జలాలు మేడిగడ్డ నుంచి సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం జూటియా తాండ వరకు 450కిలో మీటర్లు ప్రవహించి వెళ్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్వరకుఐ 375కిలో మీటర్లు ప్రవహించి, మేడి గడ్డ నుంచి 295కిలో మీటర్లు కొండపోచమ్మ వరకూ నీళ్లు వెళ్తున్నాయి. ఇలా ప్రాణహిత నుంచి కాళేశ్వరం జలాలు ఎదురెక్కి నెర్రలు బారిన బీడు భూములను తడుపుతున్నాయి.
రెండేళ్లుగా నడుస్తున్న పంపులు..
కాళేశ్వరం ప్రాజెక్టులో రీఇంజినీరింగ్ విధానానికి పంపులే కీలకంగా మారాయి. తొలి పంప్హౌస్ లక్ష్మీలో 211రోజులు నడిచి 100.45టీఎంసీల నీటిని ఎత్తిపోయగా సరస్వతీ పంప్హౌస్లో 207రోజులు నడిచి 104.20టీఎంసీల నీటిని, పార్వతీ పంప్ హౌస్లో 202 రోజులు పంపులు నడిచి 105.75టీఎంసీల నీటిని, నంది పంప్ హౌస్లో 199 రోజులు నడిచి 111.62టీఎంసీల నీటిని, గాయత్రీ పంప్హౌస్లో 196రోజులు నడిచి 108.85టీఎంసీల నీటిని ఎత్తిపోశాయి.
డిస్కవరీ చానల్లో డాక్యుమెంటరీ
డిస్కవరీ చానల్ తెలంగాణ రాష్ర్టానికి అరుదైన గౌరవమిచ్చింది. నదిని మళ్లించారు- తెలంగాణ గొప్పదనం(Lifting River ane perutho pride of Telangana) అనే పేరుతో తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మీద ఈ చానల్ గొప్ప డాక్యుమెంటరీని రూపొందించింది. 90 నిమిషాల నిడివితో జూన్ 25న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతమని, డిస్కవరీ చానల్లో చూపించబోతున్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ర్టానికి దక్కిన గౌరవం.
ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే..
రాష్ట్రంలో ఎంతో మంది ఇంజినీర్లు ఉండగా చారిత్రాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. ఈ అద్భుత నిర్మాణాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోం. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదీక్ష, ఆలోచన, సంకల్పం, ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు సమకూర్చడం, నిరంతర పర్యవేక్షణతోనే చారిత్రాత్మకమైన ప్రాజెక్టును కట్టుకున్నాం. రెండేండ్ల కిందట మూడు బరాజ్లు, మూడు పంప్హౌస్లు నిర్మించుకున్నాం. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల సహకారం మరువలేం. సహచర ఇంజినీర్లు, కార్మికుల కృషి గొప్పది.